
తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్నారని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. ‘‘సంగారెడ్డి గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా ట్రైనింగ్ తీసుకుని... పండ్ల తోటలపై పురుగుల మందులు ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ దీదీలంతా ‘స్కై వారియర్స్’. 50 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు చల్లేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు.
ఎండ బారినపడకుండా, హానికరమైన రసాయనాలకు దూరంగా ఉంటూనే సేఫ్గా వ్యవసాయం చేస్తున్నారు. సాంకేతికతను ఉపయోగిస్తూ.. వ్యవసాయంలో మహిళలు సాధికారత సాధిస్తున్నారు. అందరూ సంగారెడ్డి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ అన్నారు.రాష్ట్రంలో డ్రోన్దీదీ పైలెట్ ప్రాజెక్టు కింద అందోల్ మండలాన్ని ఎంపిక చేసి.. గత మార్చి 20 నుంచి 29 వరకు (తొమ్మిది రోజులు) డ్రోన్ నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతగా 11 మండలాల నుంచి 40 మంది డ్వాక్రా మహిళలు ట్రైనింగ్తీసుకున్నారు. అనంతరం పొలాల్లో డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తూ సక్సెస్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లింది.