డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ ఏర్పాటుకు మోడీ సర్కార్ నిర్ణయం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో యుద్ధం వస్తే, దాన్ని దీటుగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో సరికొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ(డీఎస్ఆర్వో)గా పిలిచే ఈ కొత్త సంస్థ ద్వారా స్పేస్లో అత్యాధునిక వెపన్ సిస్టమ్స్ని, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. దీనికి ప్రధాని మోడీ నాయకత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ వెల్లడించింది. బెంగళూరు కేంద్రంగా డీఎస్ఆర్వో ఏర్పాటు కానుందని, జాయింట్ సెక్రటరీ స్థాయి సైంటిస్ట్ పర్యవేక్షణలో ప్రక్రియ మొదలైందని అధికారులు చెప్పారు. త్రివిధ దళాలతో కలిసి పరిశోధనలు సాగిస్తున్న సైంటిస్టుల బృందాలనే కొత్త ఏజెన్సీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతమున్న డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ(డీఎస్ఏ)కు అవసరమయ్యే రీసెర్చ్, డెవలప్మెంట్ సపోర్ట్ను డీఎస్ఆర్వో అందించనుంది. భూమి నుంచి స్పేస్లోని శాటిలైట్ను మిసైల్తో నేలకూల్చే ‘యాంటి శాటిలైట్(ఏ–శాట్) మిస్సైల్ టెస్ట్’ను గత మార్చిలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించడం తెలిసిందే. తద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగో దేశంగా ఇండియా అవతరించింది.