150 ప్రైవేటు రైళ్లు రాబోతున్నయ్​

150 ప్రైవేటు రైళ్లు రాబోతున్నయ్​

న్యూఢిల్లీ:  ఇక నుంచి మరిన్ని  ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. తేజస్ ఎక్స్‌‌ప్రెస్ వంటి మరిన్ని  ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ తాజా బడ్జెట్‌‌లో ప్రకటించడం తెలిసిందే. వీటిని ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో తిప్పుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లు నిర్మించడానికి రూ.12 వేల కోట్లు ఇస్తామని నిర్మల ప్రకటించారు. గేజ్‌‌ మార్పిడికి రూ.2,250 కోట్లు, డబ్లింగ్‌‌ పనులకు రూ.700 కోట్లు, రోలింగ్‌‌ స్టాక్‌‌ కోసం రూ.5,786 కోట్లు, సిగ్నలింగ్‌‌, టెలికాం వసతుల అభివృద్ధికి రూ.1,650 కోట్లు ఇస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150  ప్రైవేటు రైళ్లను తిప్పాలని ఇండియన్‌‌ రైల్వే ప్రపోజ్‌‌ చేసింది. పలు అంతర్జాతీయ కంపెనీలు రైల్వే ప్రపోజల్‌‌ను స్వాగతించాయి. అల్‌‌స్టామ్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌, బొంబార్డియన్‌‌, సీమెన్స్‌‌, హ్యుండై రోటమ్‌‌ కంపెనీ, మాకరీ వంటి కంపెనీలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి. టాటా రియల్టీ అండ్‌‌ ఇన్‌‌ఫ్రా, హిటాచీ ఇండియా, ఎస్సెల్‌‌ గ్రూప్స్‌‌, అదానీ పోర్ట్స్‌‌ అండ్‌‌ సెజ్‌‌, ఐఆర్‌‌సీటీసీ వంటి ఇండియన్ కంపెనీలు  ప్రైవేటు రైళ్లను నడపడానికి ఉత్సాహంగా ఉన్నాయి.

  • మొదట 100 రూట్లలో  ప్రైవేటు రైళ్లు నడపాలని ప్రపోజ్‌‌ చేయగా, వీటిని 12 క్లస్టర్ల కింద విడగొడతారు.
  • ముంబై–ఢిల్లీ, చెన్నై–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా, షాలిమార్‌‌–పుణే, ఢిల్లీ–పాట్నా మార్గాల్లో  ప్రైవేటు రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయి.
  • ఒక రూట్లో నడిచే సాధారణ రైలు కంటే ప్రైవేటురైలు పావు గంట ముందుగా బయల్దేరుతుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి
  • ప్రతి ప్రైవేటు రైలుకు 16 కోచ్‌‌లు ఉంటాయి. ఒక రూట్లో ప్రయాణించే అత్యంత పొడవైన ప్యాసింజర్‌‌ ట్రైన్‌‌ కంటే ప్రైవేటు రైలుకు ఎక్కువ బోగీలు ఉండకుండా చూస్తారు.
  • ఒక రూట్లో చార్జీలను ఎలా వసూలు చేయాలనే విషయంలో ప్రైవేటు రైలు ఆపరేటర్‌‌/కంపెనీది తుది నిర్ణయం. రైలు కొనడానికి డబ్బు, రవాణా, నిర్వహణ వంటి అన్ని పనులూ ప్రైవేటు కంపెనీలే చేసుకోవాలి.

దక్షిణ మధ్య రైల్వేకు తొమ్మిది ప్రైవేటు రైళ్లు

హైదరాబాద్‌‌ నగర నుంచి కూడా ప్రైవేటు రైళ్లు కూత పెట్టనున్నాయి. వీటిలో కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌‌లోని పట్టణాలకు, మిగతా వాటిని ఇతర రాష్ట్రాలకు నడుపుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రైళ్లను పట్టాలనెక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో దక్షిణ మధ్య రైల్వేకు తొమ్మిది మార్గాల్లో ప్రైవేటు రైళ్లు మంజూరయ్యాయి. వాటిలో ఏడు రైళ్లు హైదరాబాద్‌‌కు మంజూరయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. అయితే భద్రత, ట్రాక్‌‌ నిర్మాణం వంటివి రైల్వేనే చూసుకుంటుందని అన్నారు. భోజనం, ఇతర వసతులు కల్పించాల్సిన బాధ్యత మాత్రం ట్రైన్‌‌ ఆపరేటర్లకే ఉంటుందని వివరించారు.