మతం, దేవుడి పేరుతో మోదీ రాజకీయాలు: ఖర్గే

మతం, దేవుడి పేరుతో మోదీ రాజకీయాలు: ఖర్గే
  • ప్రచారంతోనే ప్రధాని పబ్బం గడుపుకుంటున్నారు
  •     అన్ని వర్గాలను మోసం చేసిన్రు..అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిన్రు 
  •     రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ పనితీరు ఆదర్శంగా ఉన్నది 
  •     బీజేపీ భయపెడితే భయపడే వారెవరూ లేరన్న కాంగ్రెస్ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు :  మతం, దేవుడి పేరుతో ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘గొప్ప దార్శనికుడైన నెహ్రూ అనేక ప్రాజెక్టులు కట్టారు. పరిశ్రమలను నిర్మించారు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నెహ్రూ చెప్పేవారు. కానీ మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు. అయోధ్య గర్భగుడిలో ప్రధాని ఒక్కరే పూజ చేశారు. రాష్ట్రపతిని పిలవలేదు. అద్వానీ, మురళీ మనోహర్​ జోషిలను రానివ్వలేదు. దేశంలోని ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు. కానీ మోదీ మాత్రం దేవుడు తన దగ్గరే ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు. గురువారం హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ బూత్​లెవెల్ ​కన్వీనర్ల శిక్షణా శిబిరంలో ఖర్గే మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. పదేండ్లలో మోదీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్నామని చెప్తూ బలహీనం చేస్తున్నారు. పార్లమెంట్​లో ఎంపీలు మాట్లాడితే సస్పెండ్​ చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. మోదీ కుట్రలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

155 లక్షల కోట్ల అప్పు.. 

ప్రధాని మోదీ ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఖర్గే విమర్శించారు. ‘‘ఆకలైనోళ్లకు అన్నం పెట్టాలి.. ఉపాధి లేనోళ్లకు ఉద్యోగం ఇవ్వాలి. కానీ మోదీ రాజకీయాలు, ప్రచారంతోనే పబ్బం గడుపుతున్నారు” అని ఫైర్ అయ్యారు. ఈ పదేండ్లలో అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని, ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు..  ఏమైంది? నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? నిరుద్యోగులను, రైతులను మోదీ సర్కార్​ మోసం చేసింది. ఉద్యోగాల్లేవ్.. ఉపాధి దొరుకుతలేదు. ధరలు విపరీతంగా పెరిగాయి. అగ్నివీర్​ పేరుతో దేశంలోని యువతను మోసం చేస్తున్నారు. నాలుగేండ్లు పనిచేసి రిటైర్ అయ్యాక.. వాళ్లు ఏం చేయాలి. రైతులు, వ్యవసాయం గురించి ఆయనకు ఏమీ తెలియదు. సాగు చట్టాలు తెచ్చి రైతులను ముంచే ప్రయత్నం చేశారు. దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు.. పేదలు ఇంకా పేదోళ్లుగా మారుతున్నారు. పదేండ్ల కింద దేశం అప్పు రూ.55 లక్షల కోట్లయితే.. దాన్ని రూ.155 లక్షల కోట్లకు మోదీ పెంచారు. దేశాన్ని నిర్మిస్తున్నామని చెప్పి నాశనం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 

రాహుల్​ను ప్రధానిని చేద్దాం.. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు బూత్​ లెవెల్​ ఏజెంట్ల పాత్ర చాలా కీలకమని ఖర్గే అన్నారు. ‘‘బీఎల్ఏల కృషి వల్లే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రేవంత్ ​సీఎం అయ్యారు. రాష్ట్రంలో కష్టపడి కాంగ్రెస్​ను ఎలా అధికారంలోకి తెచ్చారో.. పార్లమెంట్​ఎన్నికల్లో అట్లనే పని చేసి రాహుల్​ను ప్రధానిని చేయాలి” అని పిలుపునిచ్చారు. ‘ప్రజల మధ్య ఉంటే గెలుస్తాం.. లేకపోతే ఓడిపోతాం’ అని నెహ్రూ చెప్పేవారని.. అందుకే అందరూ గ్రామ, బూత్ ​స్థాయిలో పని చేయాలన్నారు. దేశ ప్రజల బాగు కోసమే రాహుల్ యాత్ర చేస్తున్నారని.. దళితులు, గిరిజనులు, మహిళల కోసం ​కష్టపడుతున్నారన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్​పనితీరు ఆదర్శంగా ఉంది. మోదీ, అమిత్​షాలు.. ప్రభుత్వాలు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ పడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం​ పటిష్టంగా ఉంది. రేవంత్, మంత్రులపై మోదీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా ఉండండి. బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా.. రాష్ట్రంలో బీజేపీకి భయపడేవారెవరూ లేరు’’ అని పేర్కొన్నారు.