![అన్నింటికీ తాళాలేయడమే కాంగ్రెస్ విధానం: మోదీ](https://static.v6velugu.com/uploads/2024/05/modi-was-speaking-at-an-election-rally-held-at-vijaya-sankalpa-yatra-and-mandi-held-in-nahan-in-sirmaur-district-of-himachal-pradesh-on-friday_yWJ7D485Ck.jpg)
సిమ్లా: అన్నింటికీ తాళాలేయడమే కాంగ్రెస్ విధానమని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ తాళాలేసే సర్కారు హిమాచల్ ప్రదేశ్లో ఆ రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను మూసేసిందని అన్నారు. అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేయాలని చూస్తున్నదని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లా నహాన్లో శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర, మండిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. సిర్మౌర్కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇచ్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారని, వారికి తమ సర్కారు 10% రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. ఎవరి రిజర్వేషన్లనూ లాక్కోకుండానే ఈ కోటా ఇచ్చామని తెలిపారు.
నేను దేశం కోసమే ఇక్కడికొచ్చా
బీజేపీని మూడోసారి గెలిపించేందుకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజలను మోదీ కోరారు. “నేను ఇక్కడికి నా కోసమో.. నా కుటుంబం కోసమో రాలేదు. దేశాభివృద్ధి, హిమాచల్ అభివృద్ధి కోసం వచ్చా” అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నివసించే హిమాచల్ప్రదేశ్ ప్రజలకు దృఢమైన దేశం విలువ తెలుసునని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
రామ మందిరాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని మోదీ అన్నారు. ‘‘వారు మందిరాన్ని నిర్మించరు.. ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పరు” అంటూ తమను టీజ్ చేసిందని తెలిపారు. తాము తేదీని ప్రకటించడంతోపాటు రామమందిరాన్ని ప్రారంభించామని చెప్పారు.