లక్నో: లఖీంపూర్ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడ్ని ఇంకా అరెస్టు ఎందుకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రధాని మోడీని ఆమె క్వశ్చన్ చేశారు. బాధిత రైతు కుటుంబాలను మోడీ పరామర్శించాలన్నారు.
‘మోడీజీ నమస్కారం. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోకు మీరు వస్తున్నారని విన్నాను. నిరసన తెలుపుతున్న రైతులపై మీ ప్రభుత్వంలోని ఓ మంత్రి కుమారుడి వాహనం దూసుకెళ్లిన వీడియోను మీరు చూశారా? మీరు దీన్ని చూడండి. ఇప్పటివరకు ఆ మంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పండి. అలాగే మంత్రి కొడుకును ఎందుకు అరెస్టు చేయలేదో కూడా చెప్పండి. నా లాంటి నేతల్ని ఎలాంటి ఆర్డర్, ఎఫ్ఐఆర్ లేకుండా నిర్బంధంలో పెడతారు. కానీ ఇలాంటి నేతల్ని వదిలేస్తున్నారు. మన దేశానికి రైతులే స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని గుర్తు చేస్కోండి. ఇప్పటికీ ఈ దేశ భద్రత.. సరిహద్దుల్లో పహారాగా ఉంటున్న అన్నదాతల కుమారుల చేతుల్లోనే ఉంది. రైతులు కొన్ని నెలలుగా తమ డిమాండ్లను తెలియజేస్తున్నారు. కానీ మీరు వాటిని నిరాకరిస్తున్నారు. మీకో అభ్యర్థన.. లఖీంపూర్కు రండి. అన్నదాతల సమస్యలు, బాధలు తెలుసుకోండి. వీళ్లను రక్షించడం మీ ధర్మం, కర్తవ్యం’ అని ప్రియాంక పేర్కొన్నారు.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021