- రైతులు, కార్మికులను హత్య చేసేలా వ్యవసాయ చట్టాలు: జగ్గారెడ్డి
- ఈ నెల 16న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కిసాన్ కాంగ్రెస్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను ప్రధాని మోదీ మోసం చేశారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో రైతులు ఆందోళన చేయడంతో ఆ చట్టాలను వాపస్ తీసుకుంటామని చెప్పిన మోదీ.. ఇప్పటికీ బిల్లులను వెనక్కు తీసుకోలేదని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో కోదండ రెడ్డి అధ్యక్షతన కిసాన్ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16న ఇందిరాపార్క్ వద్ద రైతు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ..
అదానీ, అంబానీకి లాభం చేసేందుకే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. బడాబాబులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మద్దతు ధర ఇవ్వాలని, కేసులు ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని కేంద్రం పక్కన పెట్టిందన్నారు. మద్దతు ధర విషయంలో రైతుల సలహాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు, కార్మికులకు తీవ్ర నష్టం చేసేలా వ్యవసాయ చట్టాలున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు.
రైతులను కాపాడుకునేందుకు అందరూ సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు మంత్రులు కూడా వస్తారని చెప్పారు. వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన అమలు చేసే కుట్రలు చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడాబాబులకు లబ్ధి చేకూర్చే పనిలో బీజేపీ నేతలున్నారన్నారు. హైదరాబాద్లో భారీ ర్యాలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ రైతులకు అర్థమయ్యేలా నిరసన చేపట్టాలని, రైతులకు జరిగే నష్టాన్ని వివరించాలని విజ్ఞప్తి చేశారు.