క్రిప్టోలకు మనీలాండరింగ్ రూల్స్​

క్రిప్టోలకు మనీలాండరింగ్ రూల్స్​

న్యూఢిల్లీ:  క్రిప్టో కరెన్సీలపై యాంటి–మనీ లాండరింగ్ ప్రొవిజన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిప్టో ట్రేడింగ్​, సేఫ్ ​కీపింగ్​, సంబంధిత ఇతర ఫైనాన్షియల్​ సర్వీసెస్​కు యాంటి–మనీ లాండరింగ్​ చట్టాన్ని అప్లయ్​ చేస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ ఒక గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు అనుమానం కలిగించే ట్రాన్సాక్షన్ల వివరాలను  దేశంలోని  క్రిప్టో ఎక్స్చేంజీలన్నీ తప్పనిసరిగా ఫైనాన్షియల్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ ఇండియా (ఎఫ్​ఐయూ–ఐఎన్​డీ)కి తెలియచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో  గ్లోబల్​గా అనుసరిస్తున్న ట్రెండ్​నే మన దేశం కూడా ఫాలో అవుతోంది. బ్యాంకులు, స్టాక్​బ్రోకర్లకు ఏ విధంగా యాంటి–మనీ లాండరింగ్​ రూల్స్​ వర్తింప చేస్తున్నారో, ఇప్పుడు క్రిప్టోకు కూడా అదే విధమైన రూల్స్​ను అమలులోకి  తెచ్చారు. 

క్రిప్టో కరెన్సీలతో పాటు, నాన్​–ఫంగిబుల్​ టోకెన్స్​(ఎన్​ఎఫ్​టీ) వంటి డిజిటల్​ కరెన్సీ అసెట్లు గత రెండేళ్లలో గ్లోబల్​గా జోరందుకున్నాయి. ఈ ఎసెట్లలో ట్రేడింగ్​ చాలా రెట్లు ఎక్కువైంది. కిందటేడాది దాకా క్రిప్టో ఎసెట్ల నియంత్రణకు మన దేశంలో ఎలాంటి పాలసీ లేదు. క్రిప్టో ఎసెట్ల రెగ్యులేషన్​ కోసం స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొటోకాల్​ తేవాలని జీ–20 మెంబర్లతో చర్చిస్తున్నట్లు ఇంతకు ముందే ఫైనాన్స్​  మినిస్టర్ ​ నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో  వెల్లడించిన విషయం తెలిసిందే. క్రిప్టో ఎసెట్లు, వెబ్​3   కొత్తగా ఎదుగుతున్న రంగాలని, వీటి నియంత్రణకు లెజిస్లేషన్​ తేవాలంటే గ్లోబల్​ కొలాబరేషన్​ ఆవశ్యకమని ఫైనాన్స్​ మినిస్టర్​ పేర్కొన్నారు. 

క్రిప్టో ట్రాన్సాక్షన్ల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్నును  తాజా బడ్జెట్​లో విధించారు. దీంతోపాటు, అలాంటి ఎసెట్లలో ఒక పరిమితికి మించి చేసే  ట్రాన్సాక్షన్లపై ఒక శాతం టీడీఎస్​ను కూడా అమలులోకి తెచ్చారు. గిఫ్టులుగా వచ్చిన  క్రిప్టో, డిజిటల్​ ఎసెట్స్​ పైనా టాక్స్​ వేస్తున్నారు.