ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో. గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందాలని మూగజీవాలు అనుకుంటాయి. అయితే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో జగిత్యాల జిల్లా కొండగట్టులో కోతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గుక్కెడు తాగునీరు లేక అలమటిస్తున్నాయి.
తాగడానికి నీరు లేక గొంతు తడుపుకునేందుకు కోతులు తిప్పలు పడుతున్నాయి. ఎక్కడా కూడా నీరు దొరకకపోవడంతో కొబ్బరి కాయలు కొట్టే దగ్గర నీటి కోసం వానరులు చూసే పరిస్థితి నెలకొంది. భక్తులు కొబ్బరి కాయలు కొట్టే సమయంలో కిందపడే నీటిని తాగుతూ ఉపశమనం పొందుతున్నాయి. కొన్ని కోతులైతే భక్తుల దగ్గర ఉండే వాటర్ బాటిల్ను ఎత్తుకెళ్లి తాగుతున్నాయి. కోతుల నీటితిప్పలు చూడలేక కొందరు భక్తులు వాటి దాహాన్ని తీరుస్తున్నారు.