వానాకాలం సాగు అంచనా.. 4.45 లక్షల ఎకరాలు

వానాకాలం సాగు అంచనా.. 4.45 లక్షల ఎకరాలు
  • ఆసిఫాబాద్​ జిల్లాలో దుక్కులు దున్నుతున్న రైతులు
  • పత్తికే ఫస్ట్ ప్రయారిటీ

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. వరుణుడు కరుణించి, తొలకరి జల్లులు కురవడంతో రైతులు బిజీ అయ్యారు. సేంద్రియ ఎరువులు భూముల్లో చల్లుకుంటూ, దుక్కులు దున్నుతున్నారు. ఈసారి కూడా ఎక్కువ మంది రైతులు పత్తి, వరి వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాగునీటి వనరులు అంతంతమాత్రంగానే ఉండడంతో ఫస్ట్​ప్రయారిటీ పత్తికే ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

6.70 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 4,45,049 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు పత్తినే సాగు చేస్తారని భావిస్తున్నారు. ఈ మేరకు 6.70 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. పత్తి 3,35,363 ఎకరాలు, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, మొక్కజొన్న 1,000 ఎకరాలు, జొన్న, పెసర, మినుములు, సోయాబీన్‌, మిరప, వేరుశనగ, ఆముదాలు, నువ్వులు 21,395 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఆయా పంటలకు అవసరమైన యూరియా 60,081 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 40,054 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 10,013 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌సీ 20,027 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20.027 మెట్రిక్ టన్నులు, పత్తి విత్తనాలు 6,70,726 ప్యాకెట్లు, వరి 14,215 క్వింటాళ్లు, కందులు 1217 క్వింటాళ్లు అందుబాటులో ఉంచనున్నారు .

విత్తనాలు కొంటున్న రైతులు

రైతులు పత్తి, వరి, ఇతర పంటల సాగు కోసం విత్తనాలు కొంటున్నారు. వరికి సంబంధించి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, ఇతర విత్తనాలు మాత్రం ప్రైవేట్​ డీలర్ల వద్ద కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే పలు షాపుల్లో విత్తనాలను డీలర్లు అందుబాటులో ఉంచారు. వానాకాలం పంటలకు సమయం దగ్గర పడుతుండడంతో వ్యవసాయశాఖ తరఫున ఆయా మండలాల పరిధిలో విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి పెట్టారు. నాసిరకం విత్తనాలు అమ్మకుండా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

రశీదులు తీసుకోవాలి

రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పంటలు దెబ్బతింటే రశీదులను బట్టి పరిహారం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే షాప్  లైసెన్స్ రద్దు చేసి, బాధ్యులపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.   

సరిపడా విత్తనాలు, ఎరువులు

జిల్లాలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే కొనుగోలు చేయాలి. రశీదు తీసుకోవాలి. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి,  కంట్రోల్ చేస్తున్నాం. భూమి కనీసం 15 సెంటిమీటర్లు తడిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలి.  – శ్రీనివాసరావు, డీఏవో