న్యూఢిల్లీ: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం 2024 క్యాలెండర్ ఇయర్లో భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.1 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. మనదేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే బలంగా ఉండటంతో దీనిని సవరించింది. జీ20 దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా కొనసాగుతుందని పేర్కొంది.
భారత ఆర్థిక వ్యవస్థ 6-–7 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని సులభంగా నమోదు చేయగలదని పేర్కొంది. 2025లో జీడీపీ వృద్ధి రేటును 6.4 శాతంగా అంచనా వేసింది. 2024లో 6.1 శాతం వృద్ధిని ముందుగా అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ 2023లో మంచి పనితీరును కనబరిచిందని మూడీస్ ప్రశంసించింది.
