న్యూఢిల్లీ: త్రివిధ దళాల బలాన్ని పెంచేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.79 వేల కోట్ల విలువైన అడ్వాన్స్ డ్ వెపన్స్, పరికరాలు కొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. శత్రు దేశాల యుద్ధ వెహికల్స్, బంకర్లను ధ్వంసం చేయగలిగే నాగ్ మిసైల్ వ్యవస్థ మార్క్2 కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది.
గ్రౌండ్ బేస్డ్ మొబైల్ సిస్టమ్స్ తోపాటు, క్రేన్లను అమర్చగలిగే హై మొబిలిటీ వాహనాలనూ కొనుగోలు చేయాలని డీఏసీ నిర్ణయించింది. నేవీకి 30 ఎంఎం సర్ఫేస్ గన్స్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్స్, సబ్మెరైన్లను టార్గెట్ చేయగలిగే స్వదేశీ టార్పెడోలు కొనుగోలు చేయాలని డిసైడ్ చేసింది. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్లు కొనుగోళ్లకు ఆమోదం లభించింది. ఈ డాక్లు ఎయిర్ఫోర్స్ తో కలిసి జాయింట్ ఆంఫిబియస్ అసాల్ట్ ఆపరేషన్లకు, భారీ సైనిక పరికరాలు.. బలగాలను తరలించేందుకు, మానవతా సాయం, విపత్తు నిర్వహణ సమయంలోనూ ఉపయోగపడనున్నాయి.
కొలాబొరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ డిస్ట్రక్షన్ సిస్టమ్ వంటి ప్రతిపాదనలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయానికి ఆమోదం తెలపడం ఇది రెండోసారి. అంతకుముందు రూ. 67 వేల కోట్ల ప్రతిపాదనలను డీఏసీ ఆమోదించింది.
