- బడులు ఖరాబ్.. చెట్ల కింద చదువులు
- మంచినీళ్లు లేక.. టాయిలెట్లు లేక పిల్లల తిప్పలు
- సమస్యలపై మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కు లేదు
- డెవలప్చేస్తామని చెప్పి కమిటీలతో సరిపెట్టిన సర్కారు
నెట్వర్క్, వెలుగు: పైనుంచి ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడ్తదో తెలియదు.. పక్క నుంచి ఎప్పుడు ఏ మట్టి పెల్ల రాలిపడ్తదో తెలియదు.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సర్కారు స్కూళ్ల దుస్థితి ఇది. రాష్ట్రంలో 4 వేలకుపైగా సర్కారు బడులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గదుల్లో ఉండే పరిస్థితి లేక.. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెట్లకిందనే పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. ప్రతి జిల్లాలో దాదాపు వందకుపైగా స్కూళ్లు ఏ క్షణాన కూల్తయో తెలియని స్థితిలో ఉన్నాయి. పైకప్పులు పగిలిపోవడం.. గోడలకు, స్లాబులకు నడుమ సందులు రావడం.. పెచ్చులు ఊడిపడ్తుండడంతో టీచర్లు, స్టూడెంట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సర్కారు బడులను ఢిల్లీలోలెక్క డెవలప్చేస్తం.. కేరళ, ఏపీ స్కూళ్లలెక్క మారుస్తం..’’ అంటూ ఫిబ్రవరిలోనే చెప్పిన రాష్ట్ర సర్కారు.. తొమ్మిది నెలలుగా కమిటీలు, స్టడీల పేరుతో కాలం గడుపుతున్నది. రూ. 2వేల కోట్ల ప్లాన్, రూ. 7 వేల కోట్ల ప్లాన్ అంటూ ఫండ్స్కోసం ఈజీఎస్ దిక్కు, సీడీఎఫ్ వైపు చూస్తున్నది.
నిండా సమస్యలే..
రాష్ట్రవ్యాప్తంగా 26,285 సర్కారు బడుల్లో 20.46 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈసారి కరోనా ఎఫెక్ట్తో జులై ఫస్ట్ నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగా, సెప్టెంబర్1 నుంచి ఫిజికల్ క్లాసులు రన్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఈ దఫా చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ఇలా చేరిన స్టూడెంట్స్ ఒక్కో జిల్లాలో 3 వేల నుంచి 6 వేల వరకు ఉన్నారు. చాలా ఏండ్ల తర్వాత పబ్లిక్ నుంచి ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన టైంలోనూ ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు. అడపాదడపా సర్వశిక్ష అభియాన్, డీఎంఎఫ్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో అడిషనల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ కడుతున్నా ఏమూలకూ చాలట్లేదు. తాజా పరిస్థితిని బట్టి సర్కారు బడుల్లో నాలుగోవంతు అంటే 6 వేలకు పైగా స్కూళ్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఇందులో సుమారు 4 వేల బిల్డింగులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. రిపేర్లు చేయించాల్సిన క్లాస్రూములకైతే లెక్కలేదు. స్కూళ్ల ప్రారంభానికి ముందు సర్కారుకు డీఈఓలు పంపిన రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల స్కూళ్లల్లో తాగడానికి నీళ్లు లేవు. 3 వేల స్కూళ్లల్లో అమ్మాయిలకు టాయిలెట్స్ లేనట్లు వెల్లడైంది. మిషన్భగీరథ ఉన్నా.. దీనికింద ఇప్పటికీ వేలాది స్కూళ్లకు కనెక్షన్ ఇవ్వలేదు.
ప్లాన్ రెడీ.. ఫండ్స్ ఎట్ల?
రాష్ట్రంలోని స్కూళ్లను ఢిల్లీ, కేరళ, ఏపీ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్తున్న రాష్ట్ర సర్కారు ఈసారి బడ్జెట్లో ఇందుకు రూ. 2 వేల కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బడులన్నీ కొత్తగా తీర్చిదిద్దే పనులు ప్రారంభిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు తగిన సలహాలు, సూచనల కోసం విద్యా శాఖ మంత్రి సబిత, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ప్రకటన చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. పలుమార్లు సమావేశమైన సబ్కమిటీ ఫండ్స్ గురించి తర్జనభర్జనలు పడడం తప్ప చేసిందేమీ లేదు. తాజాగా మూడు దశల్లో 27 వేల స్కూళ్ల అభివృద్ధి కోసం రూ. 7 వేల కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసి చేతులు దులుపుకుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్ర సర్కారు.. ఇప్పుడీ స్కూళ్ల అభివృద్ధికి ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలన్న ఆలోచనలో పడింది. ప్రాథమికంగా 25 శాతం ఎమ్మెల్యేల సీడీఎఫ్నుంచి, మరో 25 శాతం ఈజీఎస్ నుంచి , మిగిలిన 50 శాతం నిధుల్లో కొంత మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుంచి మళ్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు కేటాయించే సీడీఎఫ్నిధుల్లోంచి కనీసం 25 శాతం ఫండ్స్ను స్కూళ్లకు కేటాయించాలని సర్కారు గతంలోనే ఆదేశించిప్పటికీ.. ఏడాదికాలంగా ఎమ్మెల్యేలు పైసా ఇవ్వలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇకముందు కూడా ఇవ్వడం అనుమానంగానే కనిపిస్తున్నది.
ఏ జిల్లాలో చూసినా..
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి1,116 స్కూళ్లు ఉండగా, వీటిలో 20 శాతం శిథిలావస్థకు చేరాయి. గతంలో జడ్పీ, మండల పరిషత్ నిధులతో స్కూల్స్ రిపేర్ చేయించేవారు. ఇప్పుడు ఆ ఫండ్స్ రావట్లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో684 స్కూల్స్ ఉండగా.. 2,031 అదనపు గదులు, 500 స్కూళ్లలో రిపేర్ల కోసం ఇటీవలే కలెక్టర్కు డీఈఓ నివేదిక పంపారు. నిజామాబాద్ జిల్లాలో 1,234 సర్కార్ బడులు ఉండగా, 10 శాతం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో దాదాపు 30 % స్కూల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.
- సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ ప్రైమరీ స్కూల్లో147 మంది స్డూడెంట్స్చదువుతున్నారు. ఆరు క్లాస్రూముల్లో నాలుగు శిథిలావస్థకు చేరుకున్నాయి. పై కప్పులకు రంధ్రాలు, గోడలకు బీటలు పడ్డాయి. కొన్ని క్లాస్రూమ్స్లో స్లాబ్పెచ్చులు ఊడిపోగ మరికొన్నింటికి తలుపులు లేవు. మూడు క్లాసులను క్లబ్ చేసి చదువులు చెప్తున్నారు.
- మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం నర్సింహాపురం బంజారా జీపీలోని లాలితండాలో 22 మంది స్టూడెంట్స్ఉండగా.. డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్ తో స్కూల్ నడుస్తున్నది. స్కూల్బిల్డింగ్పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 2012 నుంచి చెట్లకిందనే పాఠాలు చెప్తున్నారు.
- నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల జడ్పీహెచ్ఎస్స్కూల్లో 7వ తరగతి పైకప్పు వారం కింద కూలింది. దీంతో 10 రోజుల నుంచి చెట్ల కిందే క్లాసులు చెప్తున్నారు. ఐదు క్లాస్రూంలు ఉండగా రెండు రూములను సగం కట్టి వదిలేశారు.
- నాగర్ కర్నూల్లోని జడ్పీ హైస్కూల్లో 1,026 మంది స్టూడెంట్స్ఉన్నారు. 8 అడిషనల్రూమ్స్కావాల్సి ఉండగా డొనేషన్స్కలెక్ట్ చేసి రేకుల షెడ్డు వేసుకున్నారు. ఇందులో 150 మంది చదువుకుంటున్నారు. 11 టీచర్పోస్టులను నింపాల్సి ఉంది.
- సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శంచర్లలోని హైస్కూల్లో 168 మంది స్టూడెంట్స్ ఉండగా, కేవలం ఐదు క్లాస్ రూములే ఉన్నాయి. రూమ్లు సరిపోక పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కొత్త బిల్డింగ్ కోసం ప్రపోజల్స్ పంపి రెండేండ్లవుతున్నా స్పందన లేదు. తుంగతుర్తిలోని జడ్పీ స్కూల్ను ఓల్డ్బిల్డింగ్ లోనే నడిపిస్తున్నారు. నైన్త్క్లాస్రూమ్లో వర్షం వచ్చినప్పుడు పై పెచ్చులు ఊడిపడి స్టూడెంట్స్ గాయపడుతున్నారు. అయినా రిపేర్లకు ఫండ్స్ కేటాయించడం లేదు.
- హుజూర్ నగర్ మండలం బురుగడ్డ ప్రభుత్వ హై స్కూల్ లో కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభించినా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాత బిల్డింగ్ లోనే క్లాసులు కొనసాగిస్తున్నారు.
- వనపర్తి జిల్లా కొత్తకోటలో గర్ల్స్హైస్కూల్లో ఉన్న ఐదు క్లాస్రూమ్స్సరిపోకపోవడంతో రోజూ ఒక క్లాస్స్టూడెంట్స్ను చెట్ల కింద కూర్చోబెట్టి చదువులు చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్ పిల్లలను చదువులు మాన్పించారు. గతంలో 480 మంది స్టూడెంట్స్ఉండగా.. ఇప్పుడు 350కి పడిపోయింది. ఏడేండ్లుగా క్లాస్రూమ్స్కట్టించాలని ప్రజాప్రతినిధులను కోరగా మున్సిపల్ ఎన్నికల టైంలో శిలాఫలకాలు వేసి పత్తాలేకుండా పోయారు.
కేంద్రం నిధులిచ్చేందుకు ఓకే చెప్పినా రాష్ట్రం ఇవ్వట్లేదు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన స్కూళ్లకు రిపేర్లు చేయించాలని, కూలిపోయే స్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్తవి కట్టించేలా చొరవ తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఇటీవల గవర్నర్ తమిళి సైకి లెటర్ రాశారు. ఈ దిశగా సర్కారు చర్యలు తీసుకునేలా సీఎస్ను ఆదేశించాలని కోరారు. 4 వేల స్కూళ్లు శిథిలావస్థకు చేరాయని కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిపోర్ట్ పంపితే, ఎస్ఎస్ఏ కింద 60 శాతం ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వట్లేదని తెలిపారు.
131 ఏండ్ల ఓల్డ్ బిల్డింగ్లో..!
కరీంనగర్ జిల్లా చొప్పదండి టౌన్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను 1890 లో కట్టగా శిథిలావస్థకు చేరింది. ఈ 131 ఏండ్ల కిందటి బిల్డింగ్లో 127 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. పైకప్పు పెంకులు కింద పడుతున్నాయి. పక్కనే కట్టిన రేకులషెడ్డు రూమ్ కూడా పడిపోయే స్థితిలో ఉంది. వానాకాలం పాత బిల్డింగ్లోని ప్రతి రూమూ ఉరుస్తుంది. పైకప్పు మట్టి కూలుతుంది. దీంతో అందరినీ వరండాలో కూర్చోబెట్టి నెట్టుకొస్తున్నారు. సర్కారు మాత్రం కొత్త బిల్డింగ్కు పర్మిషన్ఇవ్వడం లేదు.
ఏపీలోని 17వేల స్కూళ్లలో సకల సౌకర్యాలు
మన రాష్ట్ర ప్రభుత్వం.. కమిటీలు, స్టడీలుఅంటూ కాలయాపన చేస్తుంటే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ఇప్పటికే 17 వేల స్కూళ్లను డెవలప్ చేశారు. అవసరమైన అన్నిచోట్ల కొత్త బిల్డింగులు, పాతవాటికి రిపేర్లు, అడిషనల్గదులు, వాటికి పేయింటింగ్స్, కాంపౌండ్ వాల్స్, ఫర్నిచర్, తాగేందుకు ఫ్యూరిఫైడ్ వాటర్, టాయ్ లెట్లకు రన్నింగ్ వాటర్, ప్రతి రూములో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు.. ఇలా అక్కడి ప్రభుత్వం బడులలో సకల సౌకర్యాలు కల్పించింది. ఈ క్రమంలోనే స్టడీ టూర్ కోసం అప్పట్లో తెలంగాణ ఎస్ఎస్ఏ అడిషనల్ డైరెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో మూడు టీంలు ఏపీలోని కృష్ణా జిల్లాలోని పలు స్కూళ్లకు వెళ్లి పరిశీలించి, అబ్బురపోయాయట. మనోళ్లు మాటలకే పరిమితమైతే ఏపీ ప్రభుత్వం చేతల్లో చూపిందని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అప్పట్లో చర్చ కూడా నడిచింది.
బిల్లులివ్వని సర్కారు.. వదిలేసి పోయిన కాంట్రాక్టర్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగుబండ జడ్పీ హైస్కూల్లో దాదాపు 150 మంది స్టూడెంట్స్కు ఒకటే క్లాస్రూమ్ ఉంది. ఆఫీసు రూమ్కూడా ఒక్కటే. గతంలో ఓ రూమ్కట్టడానికి ఫండ్స్వచ్చినా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. చెట్ల కిందే టీచర్లు పాఠాలు చెప్తున్నారు. గతంలో 350 మంది స్టూడెంట్స్ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 200కు పడిపోయింది.
ప్రతి రోజూ ఒక క్లాస్బయటే..
40 ఏండ్ల క్రితం కట్టిన స్కూల్మాది. మా ప్రైమరీ స్కూల్లో నాలుగు క్లాస్రూమ్స్ ఉండగా అన్ని గదుల గోడలకు పగుళ్లు వచ్చాయి. ఇప్పటివరకు వీటిని రిపేర్ చేసింది లేదు. ఎప్పుడు గోడ పడిపోతుందోనని భయపడుతూ పాఠాలు చెప్పాల్సి వస్తున్నది. ప్రతిరోజూ ఒక క్లాస్కు బయట పాఠాలు చెప్తున్నం.
- సీత, హెచ్ఎం, చండ్రుగొండ ప్రైమరీ స్కూల్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా
ప్రభుత్వానికి డీఈఓలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం..
మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లు 2000
అమ్మాయిలకు టాయిలెట్స్ లేని స్కూళ్లు 3000