మంత్రుల బండ్లు మహా స్పీడ్

మంత్రుల బండ్లు మహా స్పీడ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు‘‘రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి. జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఓవర్‌‌‌‌ స్పీడ్‌‌‌‌గా వెళ్లొద్దు. హెల్మెట్‌ పెట్టుకోవాలి. సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ తప్పనిసరి’’… రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మన మంత్రులు చేసిన కామెంట్స్ ఇవి. కానీ ఆచరణలో మాత్రం వారు అందనంత దూరంలో ఉన్నారు. మినిస్టర్ల కార్లు రూల్స్​ను యథేచ్ఛగా బ్రేక్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నాయి. కొందరి కార్లపై 2 నుంచి 6 చలాన్లు ఉన్నాయి. అవి నెలల తరబడి పెండింగ్‌‌‌‌లోనే ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ చలాన్లే కావడం గమనార్హం.

ఎవరెవరివి ఎన్నంటే..

రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంది మంత్రుల బండ్లపై చలానాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఐజీ ఇంటెలిజెన్స్‌‌‌‌ తెలంగాణ పేరుతో ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్‌‌‌‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కారుపై అత్యధికంగా 9 చలానాలతో 9,315 జరిమానా ఉంది. అయితే ఈ వెహికల్​ను జగదీశ్ ఉపయోగించడం లేదని తెలుస్తోంది. వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ కారుపై 6 చలానాలతో 6,210 ఫైన్‌‌‌‌ ఉంది. ఎస్సీ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌ సొంత వాహనంపై 5 చలానాలతో రూ.5,175 ఫైన్‌‌‌‌ పెండింగ్​లో ఉంది. సబితా ఇంద్రారెడ్డి సొంత వాహనంపై 5 చలానాలతో 2,775 జరిమానా ఉంది. పువ్వాడ అజయ్‌‌‌‌ వాహనంపై కూడా మూడు పెండింగ్‌‌‌‌ చలానాలు ఉన్నాయి. గంగుల కమలాకర్‌‌‌‌ కార్లపై మూడు, శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ సొంత వాహనంపై రెండు, సత్యవతి రాథోడ్‌‌‌‌, వేముల ప్రశాంత్‌‌‌‌ రెడ్డి కార్లపై ఒక్కోటి చొప్పున పెండింగ్‌‌‌‌ చలానాలు ఉన్నాయి.

ఇతరుల పేరు మీద మరికొన్ని

కొందరు ప్రజాప్రతినిధులు ఉపయోగించే వెహికల్స్​పైనా చలానాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వీరు ఉపయోగించే కార్లు కొన్ని కంపెనీల పేరు మీద రిజిస్టర్‌‌‌‌ అయి ఉండగా, మరికొన్ని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. రూల్స్​కు విరుద్ధంగా నంబర్ ప్లేట్‌‌‌‌ వాడటంతోపాటు, పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లడంతో ఎక్కువగా చలానాలు నమోదయ్యాయి. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన ఆఫిడవిట్‌‌‌‌లో పేర్కొన్న వివరాలు ప్రకారం నాలుగు చలానాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. రూ.3,405 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ వాహనం దీపికారెడ్డి పేరు మీద ఉంది. సబితా ఇంద్రారెడ్డి వాహనం ఇర్రెగ్యులర్‌‌‌‌ నంబర్‌‌‌‌ ప్లేట్‌‌‌‌పై జరిమానాలు ఉన్నాయి.

మంత్రుల బండ్లకు ప్రమాదాలు

ఈ మధ్య రాష్ట్ర మంత్రులు వాహనాలు, కాన్వాయ్‌‌‌‌లకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో వెళ్తుండటంతో బండ్లు అదుపు తప్పుతున్నట్లు ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఇటీవల పంచాయతీ రాజ్‌‌‌‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వాహనం అదుపు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కాన్వాయ్‌‌‌‌కి కూడా ప్రమాదం జరిగింది. గతంలో ఈటల రాజేందర్‌‌‌‌ కాన్వాయ్‌‌‌‌లో ఓ వెహికల్‌‌‌‌ బోల్తా పడింది.