- ఎమ్మెల్సీ, దళితబంధు కార్పొరేషన్ పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం
- నామినేటెడ్ పదవులపై సన్నగిల్లిన ఆశలు
- నర్సింహులును మరిచిపోయిన హైకమాండ్
- ఎమ్మెల్యే టికెట్ఇస్తే పోటీ చేస్తానంటూ సంకేతాలు
నల్గొండ, వెలుగు: బీఆర్ఎస్లో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కేసీఆర్ ఆహ్వానంతో రెండేండ్ల కింద బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆయనను హైకమాండ్ పక్కన పెట్టేసింది. కేసీఆర్తో, మోత్కుపల్లికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా బీఆర్ఎస్లో కీలక పదవి లభిస్తుందని ఆయన వర్గం భావించింది. మొదట్లో దళితబందు కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. తర్వాత నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ, ఈ రెండింట్లో ఏ పదవీ దక్కకపోవడంతో మోత్కుపల్లి అనుచరులు నారాజ్గా ఉన్నారు. కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపిక పట్టిన నర్సింహులు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
ఆలేరులో ఆ ఇద్దరు కీలకం..
కేసీఆర్ మీద నమ్మకంతో ప్రధాన పార్టీల నుంచి బీఆ ర్ఎస్లో చేరిన చాలా మంది సీనియర్లకు ఎలాంటి పదవులు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే ఓ వైపు మోత్కుపల్లి, మరో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ సపోర్ట్ కీలకం కానుంది. ఇక్కడ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వ విప్ గొంగడి సునీత మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి గెలిస్తే క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మోత్కుపల్లి ఆలేరుపై కన్నేశారనే చర్చ కాక పుట్టిస్తోంది. వాస్తవానికి మోత్కుపల్లికి, ఎమ్మెల్యేకు నడుమ ఇప్పటికైతే సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. మోత్కుపల్లి సూచన మేరకే ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే ఆయన సమీప బంధువులకు కట్టబెట్టారు. కానీ, రాజకీయ పదవి ఆశిస్తున్న మోత్కుపల్లి ఎన్నికల సమీపిస్తున్న టైంలో చేసిన కామెంట్లు ఎటువైపు దారితీస్తోయోననే ఆందోళన సునీత అనుచరుల్లో కనిపిస్తోంది.
క్యాడర్ పిలుపు మేరకే మోత్కుపల్లి ప్రకటన
ఆలేరులో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి, 2009 ఎన్నికల్లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో మాత్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతవడంతో 2018లో బీఎల్ఎఫ్ తరపున ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మళ్లీ ఇప్పుడు పార్టీ కేడర్ సూచనల మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తన రాజకీయ అనుభవం దృష్ట్యా ఉమ్మడి జిల్లాలోని ఏదైనా రిజర్వుడు నియోజకవర్గం, లేదంటే జనరల్ నియోజకవర్గంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు ఆయన వర్గీయులు చెపుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఇస్తానని చెప్పిన దళిత బంధు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవుల పైన కేసీఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతోనే మోత్కుపల్లి ఈ తరహా కామెంట్లు చేసి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.