భయాందోళనల పర్యవసానంగా తలెత్తిన ఉద్యమాలు

భయాందోళనల పర్యవసానంగా తలెత్తిన ఉద్యమాలు

బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆంగ్లేయుల​ నియంతృత్వ వైఖరి, దోపిడీ, అణచివేత, గిరిజన వ్యతిరేక విధానాలకు నిరసనగా గిరిజనోద్యమాలు ఉద్భవించి కొనసాగాయి. గిరిజన సమూహాలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు, తమ సామాజిక, రాజకీయ వ్యవస్థాపనను పున: స్థాపించుకోవడానికి వివిధ ప్రాంతాల్లో గిరిజనోద్యమాలను లేవనెత్తారు. స్వాతంత్ర్యానంతర కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ఆర్థిక విధానాల వల్ల తమ ఉనికి, గుర్తింపును కోల్పోతామేమోననే భయాందోళనలు గిరిజన సమూహాల్లో ఏర్పడ్డాయి. ఆ భయాందోళనల పర్యవసానంగా ఎన్నో ఉద్యమాలు తలెత్తాయి. కొన్ని తెగల్లో సామాజిక, మతపరమైన కారణాల వల్ల కూడా ఉద్యమాలు చెలరేగాయి. పోటీ పరీక్షల దృష్ట్యా కొన్ని ముఖ్యమైన గిరిజన, ఆదివాసీ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. 

రంప తిరుగుబాటు 

ఆంధ్రప్రదేశ్​లో ఆదివాసీల సమస్య వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఆదివాసీలు బ్రిటిష్​ పాలకులకు, వారి అండతో దోపిడీ సాగించిన భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, ముస్తాదారులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. మొదటిసారి 1802–1803వ సంవత్సరంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా చోడవరం తాలుకాలో ఉన్న రంప ప్రాంతంలో రామభూపతి నాయకత్వంలో కోయ తిరుగుబాటు జరిగింది. 

భిల్లు ఆదివాసీ తిరుగుబాటు 

భిల్లు గిరిజన జాతికి చెందిన ఆదివాసీలు గుజరాత్​లోని సూరత్​, పడమటి ఖాందేశ్​లో తపతి నదీలోయ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. 1800 నుంచి మరాఠాల పాలనలో భిల్లులు హింసాకాండకు గురయ్యారు. 1809లో భిల్లులు సమూహాలుగా ఏర్పడి మురాఠా పాలకులుగా, ఆ తర్వాత బ్రిటిష్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. 

సంతాల్​ తిరుగుబాటు 

సంతాల్​ తిరుగుబాటు బ్రిటిష్​ పాలకులకు వ్యతిరేకంగా 1885లో జరిగింది. సంతాల్​లు నివసించే ప్రాంతాన్ని సంతాల్​ పరిగణాలుగా పేర్కొనేవారు. ఈ ప్రాంతం బెంగాల్​, బిహార్​, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 1793లో బ్రిటిష్​ వారు ప్రవేశపెట్టిన శాశ్వత జమిందారీ పద్ధతి, సంతాల్​లు తరతరాలుగా అడవిని చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను జమీందార్ల పరం చేసింది. సంతాల్​ గ్రామాల్లోకి బెంగాలీ వర్తకులు ప్రవేశించి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, బాకీ కింద సంతాల్​ల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటికి వ్యతిరేకంగా 1811, 1820, 1892 సంవత్సరాల్లో అనేక చోట్ల సంతాల్​లు తిరుగుబాట్లు చేశారు. 

వర్లీ తిరుగుబాటు

మహారాష్ట్ర కోస్తా జిల్లా అయిన థానేలో ఎక్కువ సంఖ్యలో వర్లీలు నివసిస్తున్నారు. వర్లీల ప్రధాన వృత్తి వ్యవసాయం. మిగతా అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే భూస్వాములు వారి భూములను లాక్కొని వారిని వ్యవసాయ కూలీలుగా దిగజార్చారు. 1944లో రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వర్లీలకు చెల్లించే వేతనాల్లో పెరుగుదల లేకపోవడంతో వర్లీల జీవన పరిస్థితులు పూర్తిగా దిగజార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమానుషమైన దోపిడీ నుంచి విముక్తి పొందడానికి వర్లీలు వేతనాలు పెంచాలనే డిమాండ్​తో పోరాటం చేశారు. వర్లీల పోరాటం కిసాన్​ సభ నాయకత్వంలోనే జరిగింది.

తానా భగత్​ ఉద్యమం 

రాంచీ జిల్లాలో 1913–14లో తానా భగత్​ అనే కొత్త మతం బయల్దేరింది. జాత్రా భగత్​ అనే యువకుడు ఈ మతాన్ని స్థాపించి చోటానాగపూర్​ ప్రాంతంలోని ఒరావన్లలో వ్యాప్తి చేశాడు. ఈ మతస్తులకు విగ్రహపూజ, జంతు బలులు నిషిద్ధం. స్వపరిపాలన, రాచరికాల రద్దు, మానవుల మధ్య సమానత్వం, కిస్తు, కౌలు కట్టకపోవడం మొదలైనవి ఈ మతం బోధించిన ముఖ్యాంశాలు. తానా భగత్​ ఉద్యమం 1915 నాటికి రాంచీ, హజారీబాగ్​ జిల్లాలకు కూడా వ్యాపించింది. గత 32 తరాలుగా తాము పండించినదంతా భూస్వాములే కాజేశారని, అందుకే వచ్చే 32 తరాల వరకు భూస్వాములే తమను పోషించాలని వీరి వాదన. 

బిర్సాముండా తిరుగుబాటు

చోటానాగ్​పూర్​ ప్రాంతంలోని  రాజులు తమకు దిగువ స్థాయిలో ఉండే జాగీర్దార్లు, ఇనాందార్లను పరిమిత కాలానికి అధికారాన్ని అనుభవించే హక్కుదార్లుగా నియమించారు. వీరు ఆదివాసీ రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారు. తమ రాబడిని మాత్రమే చూసుకున్న ఈ వర్గాలు ఆదివాసీల కనీసపు సౌకర్యాలను కూడా పట్టించుకోలేదు. భూమిపై శాశ్వత ప్రయోజనాలు ఇమిడియున్న రాజులు కూడా సమష్టి పోడు భూములను జమిందారీ భూములుగా మార్చారు. ఒకవేళ ఎవరైనా ఆదివాసీ రైతులు శిస్తు చెల్లించనట్లయితే అలాంటి  వారి భూమిని శాశ్వతంగా వేరొకరికి అమ్మేవారు. అంతవరకు భూ యజమానులుగా కొనసాగిన ఆదివాసీ సాగుదార్లను కౌలుదార్లుగా గుర్తించారు. అదే విధంగా ఆదివాసీ సాంప్రదాయిక పరిపాలన విధానాలను బ్రిటిష్​ వారు విచ్ఛిన్నం చేశారు. ఈ క్రమంలోనే ఆదివాసీలు భూములు కోల్పోయి దుర్భర దారిద్ర్యంలోకి నెట్టబడి చాలా మంది అస్సాం తేయాకు తోటలకు కూలీలుగా వలసపోయారు. అదే సమయంలో క్రైస్తవ మిషనరీలు, జమీందార్లకు వ్యతిరేకంగా ముండాలకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆదివాసీలను (ముండాలు) క్రైస్తవ మతం స్వీకరింపజేసి గ్రామ భూమలన్నీ చర్చి కే చెందాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ముండా తెగకు చెందిన ప్రజలు మిషనరీలకు, భూస్వాములకు వ్యతిరేకంగా బిర్సాముండా నాయకత్వంలో సంఘటితంగా తిరుగుబాటు చేశారు. అదేవిధంగా ముండా రాజ్యాన్ని స్థాపించుకోవడానికి బిర్సాముండా నాయకత్వంలో 1895లో ముండా తెగకు చెందిన ఆదివాసులు బ్రిటిష్​ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు.

ఆదిలాబాద్​ గోండుల తిరుగుబాటు  

19వ శతాబ్దం చివరి వరకు గోండులు అడవిలో పోడు వ్యవసాయం చేసి, స్వేచ్ఛగా జీవించేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి బ్రిటిష్​ ప్రభుత్వం ప్రత్యక్షంగా తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలతోపాటు సామంతరాజుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లోనూ అటవీ చట్టాలను ప్రవేశపెట్టింది. తద్వారా గోండు రైతులపైన వివిధ రకాలైన పన్నులను విధించారు. ఈ పన్నులు చెల్లించకపోతే గోండు గూడాలు తగులబెట్టిపోయేవారు. పంట కల్లాల్లో ఉండగానే అంతకుముందు అప్పులిచ్చిన వ్యాపారులు బాకీ కింద బస్తాలకు బస్తాలు ధాన్యాన్ని తీసుకుపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కుమ్రం భీం 1940లో గూడేలన్నీ తిరిగి గోండులను సమావేశపరిచి పోరాట మార్గాన్ని వివరించి చెప్పారు. ఈ విధంగా జోడేఘాట్​ ప్రాంతంలో గోండులు కుమ్రం భీం నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. 

తెభాగా గిరిజన రైతాంగ పోరాటం 

తెభాగా పోరాటం భూస్వాములకు రైతులు చెల్లించే పంట వాటాను సగం నుంచి మూడో వంతుకు తగ్గించాలన్న డిమాండ్​తో 1946 సెప్టెంబర్​లో ఆదివాసీలు ప్రారంభించారు. ఉత్తర బెంగాల్​లోని దీనాపూర్​ – రంగాపూర్​లో ప్రారంభమై, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వ్యాపించి దాదాపు 24 పరగణాల  వరకు విస్తరించింది. ఈ పోరాటంలో ప్రధానంగా హజాంగ్​లనే ఆదివాసీలు, సంతాల్​ గిరిజన రైతులు పాల్గొన్నారు. ఈ పోరాటానికి ముఖ్యంగా అవిభక్త కమ్యూనిస్ట్​ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కిసాన్​ సభ నాయకత్వం వహించింది. 

సర్ధార్ల తిరుగుబాటు

రెండో షా ఆలమ్​ బెంగాల్​, బిహార్​, ఒరిస్సా దీవానీలను 1765లో తూర్పు ఇండియా కంపెనీకి గ్రాంటుగా ఇచ్చాడు. ఇది ఆ ప్రాంతాల్లోని రాజులు, కుల పెద్దల అధికారానికి గొడ్డలిపెట్టు కావడంతో చోటానాగ్​పూర్​ ప్రాంతంలో వారంతా తమ అనుచరులతో బ్రిటిష్​ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆదివాసీ రాజులు, కుల పెద్దలను సర్ధార్లని పిలిచేవారు. వీరి నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. కాబట్టి దీనికి సర్ధార్​ తిరుగుబాటు అని పేరు వచ్చింది.

మన్యం తిరుగుబాటు

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆంగ్లేయుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా 1922–24ల మధ్యకాలంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మన్యం గిరిజనులు సాయుధం పోరాటం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్​ పాలకుల అండతో జమీందార్లు, ముస్తార్లు, పోలీసులు కోయ, కొండరెడ్లపై విపరీతంగా పన్నులు విధించుతూ బ్రిటిష్​ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పని కోసం గిరిజనులతో బలవంతంగా శ్రమ చేయించాలని ప్రయత్నించడంతో వీరందరి పట్ల పేరుకుపోయిన అసంతృప్తి తిరుగుబాటుకు దారి తీసింది.