నిజామాబాద్, వెలుగు : కన్నోళ్లు, సొంత పార్టీ వాళ్లే గెంటేయడంతో ఫ్రస్టేషన్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోడలు, తన పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్ అయినందుకు ఆమెపై తనకు సింపతీ ఉందని, ప్రజల్లో అదికూడా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ ఆఫీస్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కవిత నిర్ణీత ఫార్మాట్లోనే రాజీనామా ఇచ్చినా స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టసభకు ఎన్నికైన నాయకుడు స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తే అంగీకరించాలని చెప్పారు. కానీ ఎవరి ప్రెజర్తో కవిత రాజీనామాను ఆమోదించడం లేదో మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి చెప్పాలన్నారు. సీఎం రేవంత్రెడ్డితో కవితకు బిజినెస్ పార్ట్నర్షిప్ ఉందని, ఇప్పుడు ఆమెతో పార్టీ పెట్టించే ప్లాన్ నడుస్తోందన్నారు.
అసలు కవిత యాత్ర వెనుక సీఎం రేవంత్రెడ్డి డైరక్షన్ ఉందన్నారు. తనను ఓడించడానికి రేవంత్రెడ్డి, కవిత కలిసి కుట్రలు పన్నారని ఎలక్షన్ టైంలోనే చెప్పానని గుర్తు చేశారు. సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేస్తే బీసీ బిల్లు వస్తుందన్నారు. తాను ఏం చేయాలో చెప్పే స్థాయి కవితకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, జిల్లాకు వచ్చిన నిధుల విషయాన్ని తాను నిరూపించలేకపోతే రాజీనామా చేస్తానని, మహేశ్గౌడ్ సిద్ధమేనా అని సవాల్ చేశారు. మహేశ్గౌడ్ ఇప్పటివరకు కార్పొరేటర్గా కూడా గెలువలేదన్నారు. నిజామాబాద్ మాధవ్నగర్ ఆర్వోబీ నిర్మాణం పూర్తి కావడానికి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయాలన్న డిమాండ్తో తాను చేపట్టబోయే నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, వడ్డీ మోహన్రెడ్డి పాల్గొన్నారు.
