కరోనా కట్టడిలో ఫెయిల్ అయిన రాష్ట్రం..కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది 

కరోనా కట్టడిలో ఫెయిల్ అయిన రాష్ట్రం..కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది 

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కాకుండా.. కేంద్రంపై నెపం నెడుతోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ చేసిన విమర్శల్ని ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు అర్వింద్ . కరోనా వ్యాప్తిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేయలేదన్నారు.    రాష్ట్రానికి ఎన్ని టన్నుల ఆక్సిజన్లు అవసరమో కూడా ప్రభుత్వానికి తెలియదని పత్రికా ప్రకటనలో తెలిపారు. మెడిసిన్స్ ఎన్ని కావాలనే దానిపై కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని విమర్శించారు.


కరోనా విషయంలో రాష్ట్రం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు ఎంపీ అర్వింద్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు.. ఐసీయూ బెడ్స్ సరిపోవడం లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారన్నారు. కోవిడ్ చికిత్స కోసం ఆయిష్మాన్ భారత్ ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా కోసం వ్యాక్సిన్ వేసుకొమ్మని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కాని.. ప్రచారం కాని చేయలేదని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు కరోనా కేసులు, ఆక్సీజన్, మందులపై కేంద్రానికి వాస్తవ సమాచారం ఇవ్వడంతో వారికి సరైన మద్దతు లభిస్తోందన్నారు అర్వింద్.