నియంతృత్వ నిజాం పాలనపై తిరుగుబాటు చేసి విజయం సాధించిన సర్వాయి పాపన్న జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని… ప్రస్తుత నియంతృత్వ పోకడల పై పోరాటానికి యావత్ తెలంగాణ సమాజం నడుం బిగించాలన్నారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కరీంనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదప్రజలను సమీకరించి పాపన్న చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజానీకం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను సమీకరించి గోల్కొండ కోటను కైవసం చేసుకున్న మాదిరిగా నేడు ఎంఐఎం కబంధహస్తాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో నుండి తెలంగాణ విముక్తి కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.
సర్వాయి పాపన్న స్ఫూర్తిగా సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి భీజేపీ కట్టుబడి ఉందని సంజయ్ అన్నారు. ఆనాడు నిజాం ప్రభుత్వంపై సర్వాయి పాపన్న చేసిన విరోచిత పోరాట గాథలను పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించాలన్నారు. ఛత్రపతి శివాజీ ప్రజలను సమీకరించి హిందూ సామ్రాజ్యాల నిర్మించిన మాదిరిగా పేద ప్రజలను సర్వాయి పాపన్న సమీకరించిన తీరులో సారూప్యత ఉందని అన్నారు. విదేశీ, ముస్లిం పాలకులపై చత్రపతి శివాజీ, సర్వాయి పాపన్నలు మాత్రమే విజయాన్ని సాధించారని సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.