ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : బూర నర్సయ్య గౌడ్ 

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : బూర నర్సయ్య గౌడ్ 

భూదాన్ పోచంపల్లి, వెలుగు : వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశాడు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లి వద్ద వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి మండలంలో 300 ఎకరాల్లో పంటలు నష్టపోయినా ఎమ్మెల్యే పెళ్ల శేఖర్ రెడ్డి కనీసం పరిశీలించలేదని మండిపడ్డారు.  రాష్ట్రంలో రైతులు వర్షాలతో ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  

తెలంగాణను మరిచిపోయి మహారాష్ట్రకు సీఎంలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.  రైతులు అధైర్య పడొద్దని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో పంటనష్టం అంచనా వేసేందుకు సెంట్రల్ టీం రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు  కాసం వెంకటేశ్వర్లు , సుదగాని హరిశంకర్ గౌడ్ , దోనూరి వీరారెడ్డి , మెట్టు శ్రీశైలం,  చింతా సాంబమూర్తి ,  దోనూరి వీరారెడ్డి , గోలి మధుసూదన్ రెడ్డి , పడమటి జగన్ మోహన్ రెడ్డి , యెన్నం శివకుమార్ , సుర్కంటి రంగారెడ్డి చిక్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు.