
- వీళ్ల మాటలెవరూ వింటలేరని సోనియాకు లేఖ రాశారు
- మీ తెలివి తేటలు దరిద్రపు పనులకు వాడే బదులు.. రాష్ట్రానికి సలహాలు ఇవ్వచ్చు కదా?
- రబ్బరు చెప్పులతో ఉన్నోళ్ళు.. కుబేరులయ్యిండ్రు
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఓ సైకో రామ్ అని మండిపడ్డారు. కల్లుతాగిన కోతి నిప్పులు తొక్కినట్టుగా ఆయన వాలకం ఉందన్నారు. మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్లకు ఎవరో ఒకరు అత్యుత్సాహం తో కాళ్లు తుడిచి ఉంటారని, దానికి పెద్ద రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీళ్ల మాటలు ఎవరూ వినడం లేదనే సోనియా గాంధీకి లేఖ రాశారని ఆరోపించారు.
ALSO READ | రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయం చేసి రబ్బరు చెప్పుల్లో తిరిగిన వారు ఇప్పుడు కుబేరులయ్యారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడటమే మానేశారని విమర్శించారు. రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందుతున్నాయా.? వడ్లు కొంటున్నారా..? లేదా..? అనేది తెలుసుకోవడం మానేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఫైర్ అయ్యారు. వాళ్ల తెలివి తేటలను దరిద్రపు పనులకు వాడే బదులు రాష్ట్రానికి సలహాలు ఇచ్చేందుకు వినియోగించాలని సూచించారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకత్వానికి వాళ్ల ఇంటి ఆడబిడ్డ తప్ప వేరే ఆడపడుచులు కనిపించలేదా... అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లీడర్లు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక పోతున్నారని అన్నారు.