- తాడిచర్ల 2 కేటాయింపు మా నిరంతర పోరాట ఫలితమే
- రాష్ట్ర కోల్ బ్లాక్లన్నీ వేలం లేకుండా సింగరేణికే ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్
గోదావరిఖని, కోల్బెల్ట్/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 150 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, ఎయిర్పోర్టు ఏర్పాటును బీజేపీ అడ్డుకుంటోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఆస్పత్రి ఏర్పాటుపై కేంద్రాన్ని పలుమార్లు కోరినా స్పందన లేదన్నారు. అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఫీజిబిలిటీ స్టడీ పూర్తయినా కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.
శనివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఆయ మాట్లాడారు. గతంలో తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి తరలించినట్టే, ఇప్పుడు ఈఎస్ఐ ఆస్పత్రి, ఎయిర్పోర్టు విషయంలోనూ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాడిచర్ల 2 కోల్బ్లాక్- ను సింగరేణికి కేటాయించడం తమ నిరంతర పోరాట ఫలితమేనని ఎంపీ చెప్పారు. ఈ బ్లాక్ ద్వారా ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు తీయడంతో పాటు సుమారు వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
తెలంగాణలోని అన్ని కోల్బ్లాక్లను వేలం లేకుండా సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత బీజేపీ ఎంపీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల పెర్క్స్పై ఆదాయపన్ను మినహాయింపు, రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.15 వేల పింఛన్ వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండేండ్లలో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.8 వేల కోట్ల నిధులు తీసుకొచ్చామని చెప్పారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్, ధర్మపురి–చెన్నూరు రహదారి, పలు ఆర్ఓబీలు, ఎఫ్ఓబీలకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పి.మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు, దుబాసి మల్లేశ్, పాకాల గోవర్ధన్ రెడ్డి, కామ విజయ్, తొగరి తిరుపతి, మల్లేశ్ యాదవ్, తిప్పారపు మధు, నరేందర్రెడ్డి, నర్సింగ్ దొర, గడ్డం మధు, అనుమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అర్హుల ఓట్లు పోకుండా చూడాలి..
ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లు తొలగిపోకుండా చూడాలని కాంగ్రెస్ శ్రేణులకు వంశీకృష్ణ సూచించారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు, తాండూర్ మండలకేంద్రంలో పర్యటించి 'సర్' ప్రక్రియను పరిశీలించారు. సర్వే తీరు, ఓటర్ల వివరాలను పరిశీలించి స్వయంగా సర్ ఫారమ్ నింపారు. అనంతరం తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ప్రజాస్వామ్యానికి ఓటే బలమని, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా అందరూ బాధ్యత వహించాలని సూచించారు.
సర్ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని అధికారులను కోరారు. అంతకుముందు బెల్లంపల్లి పట్టణంలోని అండర్బ్రిడ్జిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్, తాండూర్ కాంగ్రెస్ నాయకులు ఇషా, అబ్బు తదితరులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తం..
కాక వెంకటస్వామి కలల ప్రాజెక్టు అయిన తుమ్మిడిహెట్టి- ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఆసిఫాబాద్లోని ఒడ్డేపల్లి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్అవగాహనక కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి లక్షల కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.
తుమ్మిడిహెట్టి ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణ రైతుల భవిష్యత్తు ఈ ప్రాజెక్టుతో మారుతుందని పేర్కొన్నారు. సర్ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ అనుకూల వర్గాల ఓట్లకు ముప్పు పొంచి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఎల్ఏలు, పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి అదిత, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తాడిచర్ల -2కు వెంటనే పర్యావరణ అనుమతులివ్వాలి
జయశంకర్ భూపాలపల్లి/మల్హర్, వెలుగు: తాడిచర్ల -2 బొగ్గు గనికి ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల 2 బ్లాక్ప్రాంతాన్ని సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు.చాత్రాజ్పల్లికి చెందిన బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు.
ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాలని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే అవసరమైన అనుమతులు ఇచ్చి మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డిని ఎంపీ ఆదేశించారు.
