మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలు శ్రీనివాస్,నాగరాజు లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాం చందర్ రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సమస్యల మీద తమ పార్టీ కార్యకర్తలు అధికారులను అడగడానికి వెళితే అక్కడి టీఆర్ఎస్ పార్టీ అనుచరులు వారిపై దాడి చేశారని అన్నారు. సమస్యలను పరిష్కారం చేయాల్సిన పార్టీ ప్రతినిధులు దాడులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటన పై సీఎస్ ,హోం సెక్రటరీ, డీజీపీ ని వివరణ కోరుతానని తెలిపారు. మల్కాజిగిరి ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ గుండాలు తమ కార్యకర్తల పై దాడి చేశారన్నారు ఎమ్మెల్సీ రాం చందర్ రావు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వారిపై చిన్న కేస్ పెట్టి వదిలేశారన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే అనుచరులు హత్య చేయడానికి ప్రయత్నించారని, వారిపై 307 కేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తాము న్యాయ పోరాటం చేస్తామని రాంచందర్ రావు అన్నారు.