ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్​లోనే : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్​లోనే  : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  •     నా శవం మీద కాంగ్రెస్ జెండానే ఉంటది 
  •     అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన ఒక్క ఆఫీసర్​నూ వదలం
  •     భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్/ కనగల్, వెలుగు : ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. కనగల్ మండలం ధర్వేశిపురంలో గురువారం నిర్వహించిన కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బీజేపీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రాణం పోయినా బీజేపీలోకి పోనని, చనిపోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు అధికారులను, ఇతర అధికారులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. అధికారులు, పోలీసులపై గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని పనిచేయాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ ను సోనియాగాంధీని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.

6 గ్యారెంటీ స్కీములను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఈనెల 15న కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంల కరపత్రాలను ఆవిష్కరించారు.