
అసిఫాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్ల పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం బీజేపీ పాలనపై నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. మోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు, రాష్ట్ర నేత కోట్నాక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.