సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: అవినీతి సొమ్ముతో రాజమహళ్లను కట్టుకుంటున్న కేటీఆర్ ఆస్తులు, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్ను ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడితే సొంత కొడుకైనా, కూతురైనా వదిలేది లేదన్న మాటకు సీఎం కట్టుబడి ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం సీఎంకు బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. తన డిమాండ్కు సానుకూలంగా స్పందించకపోతే మరో మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని, అవసరమైతే కోర్టుకు పోతామని రేవంత్ హెచ్చరించారు. జీవో 111 పరిధిలో కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఆయన చూపించిన ఆస్తులు 2018 ఎన్నికల్లో అమాంతం పెరిగిపోయాయని, అంత భారీ ఆస్తులు ఎట్ల కూడగట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోయి, పేదరికంలో మగ్గిపోతుంటే కేసీఆర్ కుటుంబీకులు భోగభాగ్యాలతో తులతూగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ వివరాలను పుస్తకంగా రాష్ట్ర ప్రజల ముందుంచుతామని లేఖలో పేర్కొన్నారు.