
‘మిస్టర్ కూల్.. ఎంఎస్ ధోని’.. ఈ పేరుకి ఓ చరిత్రే ఉంది. తన అసాధారణమైన ఆటతో ఇండియా టీమ్ ను విజయవంతంగా ముందుకు నడిపిన రథసారథిగా ఎన్నో జ్ఞాపకాలు అందించాడు. కొత్త అధ్యాయాల్ని అలవోకగా లిఖించిన సత్తా ధోని ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇలా క్రికెట్ ఆటలో ఫ్యాన్స్ చేత కూల్ హీరో అనిపించుకున్న ధోనీ.. ఇపుడు యాక్షన్ హీరో అనిపించుకోవడానికి రెడీ అయ్యాడు. ఎస్.. ఈ ఇండియా మాజీ కెప్టెన్ త్వరలో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో ఆర్ మాధవన్, ఎంఎస్ ధోనిల కలయికలో ఓ సినిమా రాబోతున్నట్లు టాక్. లేటెస్ట్గా ‘ది ఛేజ్’ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు బాలీవుడ్ మేకర్స్. వాసన్ బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ టీజర్ను లూసిఫర్ సర్కస్ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసింది. ఇందులో ధోని, మాధవన్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లగా నటించినట్లు తెలుస్తుంది. ఈ టీజర్ పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్గా అదిరిపోయింది.
ఈ క్రమంలో ‘‘లూసిఫర్ సర్కస్ అంతిమ బ్లాక్ బస్టర్ను అందిస్తుంది! ఒక మిషన్. ఇద్దరు ఫైటర్లు.. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ, తెలివైన ఆర్. మాధవన్. మాస్టర్ స్టోరీ టెల్లర్ వాసన్ బాలా దర్శకత్వం వహించాడు. త్వరలో వస్తుంది’’అని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. అయితే, ధోనిని వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఇది సినిమానా, వెబ్ సిరీసా? లేదా ఏదైనా యాడ్ షూట్ హ? అనే క్లారిటీ లేకుండా వారు అయోమయంలో ఉన్నారు.
ఇకపోతే ధోని ఇప్పటికే తన సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ 'ధోని ఎంటర్టైన్మెంట్స్' స్థాపించాడు. ఈ బ్యానర్పై LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) మూవీ నిర్మించి రిలీజ్ చేశాడు. ఇటీవలే ధోని ఒక తమిళ మూవీలో అతిధి పాత్రలో సైతం కనిపించి ఆశ్చర్యపరిచాడు. అలానే, యాడ్స్లో కూడా నటిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇది సినిమానా? లేక యాడ్ అనే సందేహాలు నెలకొన్నాయి. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది.