గత కొన్ని రోజులుగా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ బెదిరింపు మెయిల్స్ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే మూడో మరణ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఈసారి ఈ మొత్తాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.400కు పెంచినట్లు వారు స్పష్టం చేశారు.
నిందితుడు తన మూడవ బెదిరింపు మెయిల్లో “ఇప్పుడు, అది 400 కోట్ల రూపాయలకు పెరిగింది. పోలీసులు నన్ను ట్రాక్ చేయలేకపోతే, వారు నన్ను అరెస్టు చేయలేరు. అందుకే మిమ్మల్ని (అంబానీ) చంపడానికి మాకు ఇబ్బంది లేదు. మీకెంత మంచి భద్రత ఉన్నా.. మాలో ఒకరు మిమ్మల్ని చంపుతారు” అని చెప్పుకొచ్చారు.
నిందితుడు గతంలో ఉపయోగించిన మెయిన్ ఐడీనే ఈ సారి కూడా వినియోగించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకు ముందు పంపిన రెండవ మెయిల్ లో "మీరు మా ఇమెయిల్కు ప్రతిస్పందించలేదు. మొత్తం 200 కోట్లు ఇవ్వకపోతే డెత్ వారెంట్ పై సంతకం చేయబడుతుంది" అని తెలిపారు.
మొదటి బెదిరింపు మెయిల్
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మాకు 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తాం, మా వద్ద భారత్లో అత్యుత్తమ షూటర్లు ఉన్నారు’ అని అక్టోబర్ 27న అంబానీకి మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. మెయిల్ను స్వీకరించిన తర్వాత, ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా, ముంబైలోని గామ్దేవి పోలీసులు IPC సెక్షన్లు.. 387, 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.