న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరో రికార్డువైపు అడుగులు వేస్తున్నారు. వంద బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.31లక్షల కోట్లు) సంపద కలిగిన వారి క్లబ్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ ‘లో ఓరియల్స్’ చీఫ్ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మీయర్ సంపద 92.9 బిలియన్ డాలర్లు కాగా, అంబానీ ఆయనకు దగ్గరగా వచ్చారు. వీళ్లిద్దరూ త్వరలోనే 100 బిలియన్ డాలర్ల వెల్త్ క్లబ్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంబానీ ఈ సంవత్సరం క్లీన్ ఎనర్జీవైపు ఫోకస్ చేశారు. 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల రిన్యూవల్ ఎనర్జీ తయారు చేయడానికి 10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఫలితంగా రిలయన్స్ షేర్లు ర్యాలీ చేయడంతో అంబానీ ఆస్తి శుక్రవారం మరో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడు అయిన అంబానీ ఆస్తుల విలువ ఇప్పుడు 92.6 బిలియన్ డాలర్లు. ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మీయర్స్ నెట్వర్త్ 92.9 బిలియన్ డాలర్లు. అంబానీ టెలికం కంపెనీ జియో, రిటైల్ వెంచర్ కూడా దూసుకెళుతున్నాయి. ఇండియా టెలికం మార్కెట్ లీడర్గానూ నిలిచింది. ఇందులో ఫేస్బుక్, గూగుల్ వంటి ఎన్నో కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. అంతేగాక సౌదీ ఆరామ్ కో డీల్ పూర్తయితే అంబానీ చేతికి 25 బిలియన్ డాలర్లు వస్తాయి.
కొనసాగిన రిలయన్స్ షేర్ల ర్యాలీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. వరుసగా రెండవ సెషన్లోనూ ఇవి లాభపడ్డాయి. ఈ కంపెనీ షేర్లు 1.70 శాతం లాభంతో లైఫ్టైమ్ హై రూ.2,490 వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ర్యాలీ మరింత కొనసాగవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.