భారీ అక్రమాలకు పాల్పడ్డ మున్సిపల్ ​కమిషనర్

భారీ అక్రమాలకు పాల్పడ్డ మున్సిపల్ ​కమిషనర్
  • ఆయనకు సహకరించిన బిల్​ కలెక్టర్, జవాన్
  • ప్రెస్​మీట్​లో వైస్​చైర్మన్ జాబీర్​ అహ్మద్​

భైంసా, వెలుగు: భైంసా మున్సిపల్​పరిధిలోని ఇంటి నిర్మాణ అనుమతులు, ధృవీకరణ పత్రాలు సహా ఏ పనుల్లోనూ అవినీతి, అక్రమాలను సహించబోమని వైస్ ​చైర్మన్​ జాబీర్ అహ్మద్​స్పష్టం చేశారు. రెండ్రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్​ వెంకటేశ్వర్​రావు, బిల్​ కలెక్టర్ ​విద్యాసాగర్ లంచం తీసుకుంటూ​ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జాబీర్​అహ్మద్ గురువారం తన ఛాంబర్​లో ప్రెస్​మీట్ ​నిర్వహించారు. కమిషనర్​ వెంకటేశ్వర్​రావు మున్సిపల్​ఆఫీస్​లో కాకుండా బయట నోటీసులు టైప్​ చేయించి, వాటిని జారీ చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించామన్నారు. ఇందుకు ఆఫీస్​లోని శానిటరీ సెక్షన్​కు చెందిన జవాన్​ గంగాచారి, బిల్​కలెక్టర్​విద్యాసాగర్​ కమిషనర్​కు సహకరించారని.. ఈ ముగ్గురూ కలిసి శానిటేషన్​ విభాగంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు.

పలువురు రెగ్యులర్​ శానిటేషన్​ సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా వివరాలు నమోదు చేసి వేతనాలు చెల్లిస్తూ వారి వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు, ఆధారాలతో కలెక్టర్​కు ఫిర్యాదు చేసి గంగాచారిపైనా చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్​ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా మీటింగ్​ నిర్వహించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజల నుంచి డబ్బులు అడిగినా, వేధించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.