- మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి పోటెత్తిన అభ్యర్థులు
- కిటకిటలాడిన నామినేషన్ కేంద్రాలు
- నేటి నుంచి నామినేషన్ల విత్ డ్రా
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు పోటెత్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏకంగా 20 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు, నేతలు, పార్టీల కార్యకర్తల రాకతో నామినేషన్ కేంద్రాలన్నీ కిటకిటలాడాయి. డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ పార్టీ జెండాలతో ఊరేగింపుగా రావడంతో అన్నిచోట్లా సందడి నెలకొన్నది. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు 28,456 నామినేషన్లు వేశారు.
శుక్రవారం అర్ధరాత్రి వరకు క్యూలైన్లు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. శనివారం నుంచి ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. శనివారం నామినేషన్ల పరిశీలన(స్క్రూటినీ) చేపట్టడానికి ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వేయని నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లపై ఆదివారం విచారణ చేపడుతారు.
నామినేషన్ కోసం రూ.7.51 కోట్ల చెల్లింపు..
నిజామాబాద్ కార్పొరేషన్లోని 19 డివిజన్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా నామినేషన్ వేయడానికి కాటిపల్లి శమంత అనే అభ్యర్థి రూ.7.51 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో శమంత భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ జీప్లస్ 5 ఫ్లోర్లో నడుస్తున్న హోటల్లో పన్నుల తేడాలు గుర్తించిన కార్పొరేషన్ ఆఫీసర్లు పెనాల్టీ, వడ్డీ విధించారు.
దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లగా రీ అసెస్మెంట్కు కోర్టు మార్చి 2025 లో ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో విధించిన ట్యాక్స్ ను క్రాస్ చెక్ చేసిన ఆఫీసర్లు కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు ఫైల్ పంపడానికి రెడీ అయ్యారు. ఇంతలోనే మున్సిపల్ ఎలక్షన్స్ రావడంతో రీ అసెస్మెంట్ అయ్యే దాకా తన నుంచి ట్యాక్స్ తీసుకోవద్దని నామినేషన్ వేయడానికి ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ ఇప్పించాలని శమంత మరోసారి కోర్టులో కేసు వేయగా జడ్జి అంగీకరించలేదు. దీంతో ఆమె రూ. 7.51 కోట్ల ట్యాక్స్ ను బ్యాంకు డీడీ గా ఇచ్చి నో డ్యూస్ సర్టిఫికెట్తో 19 డివిజన్ నుంచి నామినేషన్ వేయడం విశేషం.
నో డ్యూస్తో రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాలన్న షరతు ఉంది. దీంతో చాలా మంది పెండింగ్లోని డ్యూస్ను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రూ.50 కోట్లకు పైగా ట్యాక్స్ వసూలైనట్లు సీడీఎంఏ ఆఫీసర్లు తెలిపారు.
