
- నది ప్రక్షాళనకు రాష్ట్ర సర్కార్ యాక్షన్ ప్లాన్
- ఎకలాజికల్, హెరిటేజ్, మెట్రో జోన్లుగా విభజన
- సిటీలో ప్రవహించే
- 53 కిలో మీటర్ల మేర క్లీనింగ్
- ముందుగా నది సరిహద్దుల గుర్తింపు కోసం సర్వే
- ఆ తర్వాత మూసీ వెంట డెవలప్ మెంట్ పనులు
హైదరాబాద్, వెలుగు: మూసీ నది బ్యూటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మురుగుతో నిండిపోయి కంపు కొట్టే నదిని మంచినీటి కొలనుగా మార్చేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని మూసీ రివర్ఫ్రంట్కార్పొరేషన్పనులను చేపట్టింది. ముందుగా నది క్లీనింగ్ కు అవసరమైన యాక్షన్ ప్లాన్ను అధికారులు రెడీ చేశారు. ఆపై బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలి దశలో హైదరాబాద్నడిబొడ్డున ప్రవహించే నదిని 53 కి.మీ మేర ప్రక్షాళనకు తీర్మానించింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు, కొల్ కతాలోని హుగ్లీ నది ప్రాజెక్టును చూసొచ్చారు. ఆ రెండు ప్రాజెక్టుల నమూనాను తీసుకుని మూసీ బ్యూటిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్షించారు. కాగా ప్రాజెక్టు చేపట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండగా.. తొలి దశలో నదిలో మురుగును తొలగించే పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే మూసీని మూడు జోన్లుగా విభజించి పనులు చేపట్టాల ప్రతిపాదించారు.
మూడు జోన్లుగా విభజించి పనులు
నది పరివాహక ప్రాంతాలను మూడు జోన్లుగా విభజిస్తారు. ఉస్మాన్సాగర్నుంచి పురానాపూల్వరకు ఎకలాజికల్ జోన్గా, పురానాపూల్ నుంచి చాదర్ఘాట్వరకు హెరిటేజ్ జోన్ గా, చాదర్ఘాట్నుంచి ఉప్పల్ వరకు మెట్రోజోన్గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. ముందుగా నదిని క్లీన్ చేసిన తర్వాత కృష్ణా, గోదావరి జలాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలను నింపాలని ప్రతిపాదించారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మూసీలోకి వదలం ద్వారా నదిలోని మురుగంతా కొట్టుకుపోతుందని భావించింది. ఇక ఏడాది పొడవునా మూసీలో నీళ్లు ఉండేలా చెక్డ్యామ్లను కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. భవిష్యత్లో జంట జలాశయాలకు వరదలు వచ్చినా ఆ నీటిని మూసీలోకి వదిలేలా కనెక్టివిటీ ఏర్పాటు చేయనుంది. నది పరివాహక ప్రాంతాలను ఒక యూనిట్గా తీసుకుంది. దక్షిణం వైపు నార్సింగి వద్ద ఓఆర్ఆర్నుంచి మొదలుకుని బాపూఘాట్వరకు, అక్కడి నుంచి హైకోర్టు వరకు, ఇక్కడి నుంచి చాదర్ఘాట్, నాగోల్మీదుగా తూర్పు వైపున ఓఆర్ఆర్వరకు మూసీ రివర్ఫ్రంట్ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడు జోన్లలోని చారిత్రక ప్రదేశాలను కలుపుతూ మూసీ బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు అందుకనుగుణంగా చార్మినార్, తారామతి బారాదరి, గోల్కొండ, కుతుబ్షాహి టూంబ్స్వంటి హెరిటేజ్నిర్మాణాలను కలుపుతూ పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దనుంది.
పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి
తొలి దశలో మూసీ కంపు నివారణలో భాగంగా నదిని క్లీన్చేసిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అందుకు మూసీ కారిడార్వెంట మెట్రో రైల్తో పాటు, రోడ్డు మార్గం కూడా చేపడతారు. ఇవి పూర్తయితే నది వెంట పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. మూసీకి రెండు వైపులా ఉన్న భూమిని వాడుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో భాగంగా వినోద కేంద్రాలు, రెస్టారెంట్స్, క్రీడా సౌకర్యాలు, వ్యాపార కేంద్రాలు, అమ్యూజ్మెంట్పార్కులు, వాటర్ఫాల్స్, చిల్డ్రన్స్పార్కులు, వాటర్స్పోర్ట్స్, సైకిల్ట్రాక్, గ్రీనరీ స్పేస్, చిన్న వంతెనలు నిర్మించి సిటీవాసులకు అందుబాటులోకి తెస్తారు. మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ తర్వాత పర్యాటకంగా కూడా సిటీ అభివృద్ధి చెందే చాన్స్ ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే... ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలిసింది.
ముందుగా నది సరిహద్దులపై సర్వే
మూసీ క్లీనింగ్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా నది సరిహద్దులను గుర్తించేందుకు మూసీ రివర్ఫ్రంట్డెవలప్మెంట్కార్పొరేషన్తగు చర్యలకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖతో కలిసి సర్వేకు నిర్ణయించింది. ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి కూడా పంపింది. గ్రీన్సిగ్నల్కూడా వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా మూసీలో గరిష్ట వరద ప్రవాహం ముందుగా అంచనా వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఉన్న రికార్డుల ఆధారంగా సిటీలో మూసీ పొడవునా 53 కి.మీ మేర గుర్తించారు. సర్వేలో భాగంగా నదిలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు వ్యర్థాలు ఉన్నాయనేది డ్రోన్ద్వారా పరిశీలించిన తర్వాత క్లీనింగ్ పనులు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. నదిలో వరద ప్రవాహ అంచనాకు 1.5 లక్షల క్యూసెక్కులను ప్రామాణికంగా తీసుకుంటామని చెబుతున్నారు. మూసీలో పేరుకుపోయిన వ్యర్థాలను తీయడమే కాకుండా నది పరివాహక ప్రాంతాల్లో ఎంత మేరకు ఖాళీ భూములు ఉన్నాయనేది ప్రభుత్వం గుర్తించాక అనువైన ప్రాంతాల్లో నిర్మాణాలను చేపడతామని తెలిపారు.