న్యూఢిల్లీ: టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా పడింది. కంపెనీలో పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన ‘ఎక్స్’ (ట్విటర్) పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో ఇండియాను సందర్శిస్తానని అన్నారు. ఎలాన్ మస్క్కు ఈ నెల 22 న ప్రధాని మోదీతో అపాయింట్మెంట్ ఉంది. స్టార్టప్ ఫౌండర్లతో ఢిల్లీలోని భారత్ మండపంలో సమావేశం కావాల్సి ఉంది.
స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్, పియర్సైట్, దిగంతర, శాట్సురా, గెలాక్సిఐ వంటి స్పేస్ స్టార్టప్ కంపెనీలు తమ ప్రొడక్ట్లను ఎలాన్ మస్క్కు చూపించాలని ప్లాన్ చేసుకున్నాయి. ఈ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. గత వారం రోజులుగా టెస్లా బిజీబిజీగా ఉంది. 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించింది. అంతేకాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్లు కొంత మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎలాన్ మస్క్కు ఇవ్వాల్సిన 56 బిలియన్ డాలర్ల కాంపెన్షేషన్ ప్లాన్కు ఈ ఏడాది ప్రారంభంలో డెలవేర్ కోర్టులో చుక్కెదురయ్యింది. ఈ ప్లాన్ను మళ్లీ సబ్మిట్ చేస్తామని ఈ నెల 17 న టెస్లా ప్రకటించింది.
పెడల్ సమస్య కారణంగా 3,900 సైబర్ ట్రక్లను ఈ నెల 19 న కంపెనీ రీకాల్ చేసుకుంది. వీటికి తోడు తన మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ కార్ల రేట్లను యూఎస్లో 2 వేల డాలర్ల చొప్పున తగ్గించింది. కంపెనీ సేల్స్ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో పడిపోయాయి. దీంతో కార్ల ధరలను టెస్లా తగ్గించింది.