- నా కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లనూ వదలలేదు
- రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నరు
- డీజీపీకి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు
- రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వినతి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు, బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం హైదరాబాద్కే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ రవిగుప్తాకు ఆయన ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను డీజీపీకి ఎమ్మెల్యే అందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పరిధిని రాష్ట్ర స్థాయిలో తీసుకుని దర్యాప్తు చేపట్టాలని కోరానని తెలిపారు. గత ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అపవిత్ర కలయికతో తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోనూ వందల మంది ఫోన్లను నాటి జిల్లా మాజీ మంత్రి ఆదేశాలతో కొందరు ఎస్ఐబీ సిబ్బంది ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఐదేండ్లుగా హైదరాబాద్తో పాటు జిల్లాలోను సర్వర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తిగత అంశాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ట్యాపింగ్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.