600 మందిని విచారించి హత్య కేసు ఛేదించారు!

600 మందిని విచారించి హత్య కేసు ఛేదించారు!
  • ఒంటరి మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
  • నిందితులను అరెస్ట్ చేసిన మంచిర్యాల జిల్లా పోలీసులు 

మంచిర్యాల, వెలుగు: మహిళ హత్య కేసును మంచిర్యాల జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఆరు నెలలుగా మిస్టరీగా మారిన కేసులో అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి వందల మందిని విచారించారు.  చివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ ఎ.భాస్కర్​తెలిపిన ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గణేశ్​నగర్​లో కూస లక్ష్మి(58) ఒంటరిగా ఉంటుంది. 

స్థానిక గోదావరి రోడ్డుకు చెందిన  నరేశ్​తో ఆమెకు పరిచయమైంది. అతడు కటింగ్ షాపులో పనిచేసేవాడు. లక్ష్మి వద్ద బంగారం, డబ్బులు ఉన్నాయని తెలుసుకుని ఆమెను చంపి వాటిని తీసుకుంటే తన అప్పులు తీర్చవచ్చని ప్లాన్ చేశాడు. అతడితో సహజీవనం చేస్తున్న హైదరాబాద్ కు చెందిన అలివేలుతో కలిసి గతేడాది నవంబర్​27న లక్ష్మిని ఆమె ఇంట్లో గొంతు నులిమి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎలాంటి క్లూ లభించకపోవడంతో మొబైల్​సిగ్నల్స్​, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సుమారు 600 మందిని ఎంక్వయిరీ చేసినట్టు తెలిసింది.

 ప్రస్తుతం హైదరాబాద్​లో ఉంటున్న నరేశ్, అలివేలును అనుమానించారు. మంగళవారం మంచిర్యాలలో వెహికల్స్​చెక్​ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్​కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ ప్రమోద్ రావు, ఎస్ ఐలు కిరణ్, తిరుపతి, మధుసూదన్ ను డీసీపీ అభినందించారు.