సింగరేణి సీఎండీ శ్రీధర్​పై సీఎంకు కంప్లైంట్

సింగరేణి సీఎండీ శ్రీధర్​పై సీఎంకు కంప్లైంట్
  • ఈమెయిల్ లో ఫిర్యాదు చేసిన టీబీజీకేఎస్ మాజీ ప్రెసిడెంట్
  • బీఆర్ఎస్  ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారికంగా భూములు భవనాలు కేటాయించారని ఆరోపణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​ కంపెనీ  చైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్​.శ్రీధర్​పై టీబీజీకేఎస్​ మాజీ  ప్రెసిడెంట్, ప్రస్తుత కాంగ్రెస్​ లీడర్ ​ఆకునూరి కనకరాజు.. సీఎం రేవంత్​ రెడ్డికి మంగళవారం ఈ మెయిల్​ ద్వారా కంప్లైంట్​ ఇచ్చారు. తన కంప్లైంట్​పై సీఎం ఆఫీస్​ స్పందించిందని ఆయన చెప్పారు. పూర్తి వివరాలను ఇవ్వాలని తనకు సీఎం ఆఫీస్​ నుంచి ఫోన్​ వచ్చిందని మీడియాకు ఆయన తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన సీఎండీ గత పదేండ్ల కాలంలో బీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అధికారికంగా సింగరేణి భవనాలు, క్వార్టర్లు, భూములను కేటాయించారని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఓ టీబీజీకేఎస్​ నేత దాదాపు 70కి పైగా క్వార్టర్లను ఆక్రమించుకొని వాటిలో కొన్నింటిని అద్దెకు ఇచ్చినట్లు సీఎంకు ఫిర్యాదుచేశానని వెల్లడించారు.

బీఆర్​ఎస్​ పాలనలో బెల్లంపల్లి, పినపాక, చెన్నూర్​ ఎమ్మెల్యేలకు పలు క్వార్టర్లను ఇష్టారాజ్యంగా కేటాయించారని తెలిపారు. ఆ కేటాయింపులను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. సింగరేణి నిధుల మళ్లింపుపై సీఎండీపై సమగ్ర విచారణ చేపట్టాలని తాను సీఎంకు విజ్ఞప్తి చేశానని కనకరాజు  తెలిపారు.