
భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జాంగ్ గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ మీర్ షకీలూర్ రెహ్మాన్ కు అక్రమంగా భూమి కట్టబెట్టిన కేసులో పిఎంఎల్ఎన్ నాయకుడు నవాజ్ షరీఫ్పై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో షరీఫ్కు నోటీసులు పంపారు. కానీ, ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దాంతో షరీఫ్ పై అరెస్టు వారెంట్ జారీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ గుండె సంబంధిత చికిత్స కోసం లండన్ లోని రాయల్ బ్రోంప్టన్ మరియు హేర్ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జియో గ్రూప్ గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్ కు చట్టవిరుద్ధంగా ఇచ్చిన లాహోర్ లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్ ను మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించింది.
నవాజ్ షరీష్ అల్-అజీజియా మిల్స్ అవినీతి కేసులో లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున కోర్టు అతనికి నాలుగు వారాల అనుమతితో బెయిల్ ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం షరీఫ్ లండన్ వెళ్లాడు. అతని ఆరోగ్యం కుదుటపడగానే వెంటనే పాకిస్తాన్ కు తీసుకొచ్చి ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తారు.
For More News..