
న్యూఢిల్లీ: ఎన్నో దశాబ్దాలుగా బలగాల బందోబస్తు మధ్య ఉన్న నాగాలాండ్, అస్సాం, మణిపూర్లకు స్వేచ్ఛ వచ్చింది. అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ని వెనక్కు తీసుకుంటున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. ఏఎఫ్ఎస్పీఏ అధీనంలో ఉన్న ప్రాంతాలను తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడడం వల్ల వాటిని ఏఎఫ్ఎస్పీఏ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. కొన్నేండ్లుగా ప్రధాని మోడీ తీస్కుంటున్న చర్యల వల్ల అక్కడ తీవ్రవాదం తగ్గిందని, ప్రశాంత వాతావరణం ఏర్పడి ఇంతకుముందెన్నడూ ఎరుగని అభివృద్ధి కూడా జరుగుతోందని తెలిపారు. అయితే, ఆ మూడు రాష్ట్రాల నుంచి ఏఎఫ్ఎస్పీఏని పూర్తిగా వెనక్కు తీసుకోవడం లేదని, టెర్రరిజం ప్రభావం ఉన్న కొన్నిచోట్ల ఇంతకుముందున్నట్టే అది అమల్లో ఉంటుందని హోం శాఖ అధికారులు ప్రకటించారు. 2014తో పోలిస్తే ఇప్పుడు అక్కడ తీవ్రవాదం 74% తగ్గిందని అన్నారు. భద్రతా బలగాల మరణాలు 60%, ప్రజల మరణాలు 84 % వరకు తగ్గాయన్నారు. చర్చలు ఫలించి ఇప్పటిదాకా 7 వేల మంది తిరుగుబాటుదారులు లొంగిపోయారని పేర్కొన్నారు.
ఇదీ ఆ చట్టం కథ..
వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో అప్పట్లో టెర్రరిజం, చొరబాట్లు ఎక్కువగా ఉండేవి. దీంతో 1958 సెప్టెంబర్ 11న అస్సాంలో నాడు భాగమైన నాగాహిల్స్లో ఏఎఫ్ఎస్పీఏని తొలిసారి నాటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తర్వాత అస్సాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, మిజోరాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ దానిని విస్తరించింది.