
కెరీర్లో ఫస్ట్ టైమ్ విలన్ క్యారెక్టర్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చిందని నాగార్జున అన్నారు. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జునతోపాటు ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ ‘‘నిన్నేపెళ్లాడతా’ చేసిన తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. ‘ఇప్పుడెందుకు ఇలాంటి కథ’ అని కొందరు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అయితే నాకు కొత్తదనం ఇష్టం. సెట్కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పనిచేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నా. ఒకరోజు లోకేష్ నన్ను కలిసి ‘మీరు విలన్గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. తను చెప్పిన ‘కూలీ’ కథ నాకు చాలా నచ్చింది. ‘రజినీ సర్ ఈ కథ ఒప్పుకున్నారా’ అని అడిగా. ఎందుకంటే నేను పోషించిన ‘సైమన్’ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో, విలన్స్ని ఈక్వెల్గా చూపిస్తాడు. నా పాత్రను లోకేష్ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. రజినీ సర్తో కలిసి నటించడం వెరీ హ్యాపీ.
సన్ పిక్చర్స్ ఇచ్చిన బడ్జెట్లో రూ.5 కోట్లు మిగిల్చి మరీ లోకేష్ సినిమా పూర్తి చేశాడు. చాలా వరకూ సన్నివేశాలన్నీ సింగిల్ టేక్లో ఓకే అయిపోయేవి. సినిమా కట్ వెర్షన్ చూసి డబ్బింగ్ చెబుతుంటే ఇంత బాగా నటించామా అనిపించింది. నెగిటివ్ రోల్ చేసినా.. పాజిటివ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చిన సినిమా ఇది’ అని అన్నారు. ‘కూలీ’ తన డైమండ్ జూబ్లీ పిక్చర్ అని స్పెషల్ వీడియో బైట్లో రజినీకాంత్ చెప్పారు. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని శ్రుతి హాసన్ చెప్పింది. ఈ మూవీ ఆడియెన్స్కు కొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ లోకేష్ అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యరాజ్, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని అన్నారు.