
- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, జడ్చర్ల, మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. గురువారం తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్, శిరసవాడలలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పాల్గొన్నారు.
బాలికల పాఠశాల పరిశీలన
విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించొద్దని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని చిట్టెబోయిన్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. బాలికలతో కలిసి ఆయన భోజనం చేశారు. జాయింట్ కలెక్టర్ నర్సింహారెడ్డి, స్థానిక అధికారులు ఉన్నా రు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్లో..
మహబూబ్ నగర్ కలెక్టరేట్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గురువారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపై చర్చించారు . అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కాపాడినందుకు అభినందించారు. కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.