- అర్హుల్లో బ్యాంక్ షూరిటీ ఇచ్చింది 30 మంది మిల్లర్లే
- 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
- కొన్న వడ్లు ఎక్కుడ నిల్వ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు
నాగర్ కర్నూల్, వెలుగు: వానాకాలంలో రైతులు పండించిన వడ్లను ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 142 రైస్ మిల్లులు ఉంటే, ఇందులో 101 మిల్లులు డీఫాల్టర్ లిస్టులో ఉన్నాయి. మిగిలిన 40 మిల్లుల్లో 30 మంది మిల్లర్లు మాత్రమే బ్యాంక్ షూరిటీ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన వడ్లను అమ్ముకున్న 8 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. దీంతో మిగిలిన డీఫాల్టర్ మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో జిల్లాలో రైతులు పండించిన 4.50 మెట్రిక్ టన్నుల వడ్లను ఎవరికీ కేటాయించాలని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అడ్డగోలు దందా..
ఇన్నాళ్లు అధికారుల సహకారంతో మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ అప్పగించకుండా అక్రమాలకు పాల్పడ్డారు. రెగ్యులర్గా తనిఖీలు చేయాల్సి నసివిల్ సప్లై ఆఫీసర్లు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో మిల్లర్లకు కేటాయించిన వడ్లకు, ఎఫ్సీఐకి అప్పగించిన బియ్యానికి పొంతన లేకుండా దందా నడిపించారు. మిల్లర్లకు సివిల్ సప్లై అధికారులు తమవంతు సహకారం అందించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఐదేండ్లుగా మిల్లర్లకు ఇచ్చిన వడ్లకు, వారు తిరిగి ఇచ్చిన బియ్యానికి లెక్కలు తీసి బకాయిలు చెల్లించాలని మిల్లర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈసారి రికార్డ్ స్థాయిలో వడ్ల దిగుబడి..
ఈ వానాకాలం సీజన్లో నాగర్కర్నూల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు.1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 25 శాతం రైతులు తమ సొంత అవసరాలకు ఉంచుకున్నా, మిగిలిన వడ్లు మార్కెట్లో అమ్ముకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అమ్ముతారనే అంచనా ఉంది. జిల్లాలో వచ్చిన దిగుబడిలో మూడవ వంతు వడ్లు కొనుగోలు చేయడానికి మార్కెటింగ్, సివిల్ సప్లై ఆఫీసర్లు ప్రతి సారి ఇబ్బందులు పడుతున్నారు.
వడ్లు ఎవరికి ఇయ్యాలో?
జిల్లాలో 142 రైస్ మిల్లులు ఉంటే 101 మిల్లులు డీఫాల్టర్ లిస్టులోకి ఎక్కాయి. 2024లో 50 శాతం సీఎంఆర్ పెట్టిన 40 మిల్లులకు ఈసారి అవకాశం ఇచ్చినప్పటికీ, బ్యాంక్ షూరిటీ ఇవ్వాలనే కండీషన్తో మిల్లర్లు భయపడుతున్నారు. ఈక్రమంలో కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించకుండా, ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిల్లింగ్ చేసి సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లపై ప్రభుత్వం 6 జి కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. దీంతో కోట్లాది రూపాయలు బకాయి ఉన్న మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు.
కోట్లలో బకాయిలు..
నాగర్ కర్నూల్ జిల్లాలోని మిల్లర్లు రూ.232 కోట్లు బకాయి పడితే, అధికారులు ఇప్పటి వరకు రూ.138 కోట్ల వరకు కట్టించారు. రూ. 94 కోట్ల బకాయిలు కట్టాల్సి ఉంది. సివిల్ సప్లై అధికారులు కేసులు పెట్టగానే, బెయిల్ తెచ్చుకున్న మిల్లర్లు ఆ తరువాత వేరే దందాలు చేసుకుంటున్నారు. గత డిసెంబర్లో 8 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన అధికారులు, మరో 10 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ, 50 శాతం సీఎంఆర్ ఇచ్చారనే కారణంతో కేసుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇదిలాఉంటే మూడేండ్ల కింద తీసుకున్న వడ్లకు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
