- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మరోసారి మౌలిక సదుపాయాలు పరిశీలించాలన్నారు.
ఎన్నికల విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్. జె శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
మహిళలకు వడ్డీలేని రుణాలతో ఆర్థిక భరోసా
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వడ్డీ లేని రుణాలు దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలలో భాగంగా జిల్లాలో రూ 26 కోట్ల 34 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. తిప్పర్తి లో పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తామని, నల్గొండ,తిప్పర్తి మండలాలలో రైస్ మిల్లుల నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, నియోజకవర్గంలోని మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
