నల్గొండ మున్సిపల్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

నల్గొండ మున్సిపల్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీల కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అధికారుల తీరును ఎండగడుతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న మున్సిపల్ సమావేశాలు రసాభాసాగా జరుగుతున్నాయి. అభివృద్ధి జరగడం లేదని, నిధులు కేటాయించడం లేదంటూ వారు ఫైర్ అవుతున్నారు. పార్టీకి చెందిన కౌన్సిలర్లకు కనీసం సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కౌన్సిలర్లు ఏకంగా బాయ్ కాట్ చేస్తుండడంతో అధికార పార్టీ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపల్ సమావేశాన్ని కొంతమంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇది జరిగిన కాసేపటికే నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కౌన్సిలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయం తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. 

శనివారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అధికార పార్టీకి చెందిన ఈ సమావేశానికి హాజరు కావొద్దని 12 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్ లో రహస్య భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉన్నారని సమాచారం. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైఖరిపై వాళ్లు అసంతృప్తి వెళ్లగకుతున్నారు. పట్టణ అభివృద్ధిలో కనీసం కౌన్సిలర్లకు సమాచారం లేకుండా పనులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కనీసం నిధులు కేటాయించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ గా ఉన్న వార్డులో అభివృద్ధి శూన్యం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి శనివారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాలి.