త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లు ఇంద్రసేనా రెడ్డి

 త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లు ఇంద్రసేనా రెడ్డి

త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం (అక్టోబర్​ 26న) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్.. నల్లు ఇంద్రసేనా రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

అంతకుముందు..  బుధవారం (అక్టోబర్​ 25న) నల్లు ఇంద్రసేనా రెడ్డి దంపతులు అగర్తలా చేరుకున్నారు. ఆ సమయంలో వారికి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. 

ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్‌లో ముఖ్యమంత్రి మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనా రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను మాణిక్ సాహ వివరించారు. 

నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2022లో రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే.