
నేచర్ని ఎంజాయ్ చేయాలనుందా? దైవ దర్శనాలకు వెళ్లాలనుందా? అల్లరి చేసే పిల్లలతో గడపాలనుందా? చరిత్ర విషయాలు తెలుసుకోవాలనుందా? వీటన్నింటికి కోసం ఒక్కో టూర్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కలిపి ఒకే చోట దొరికే ప్లేస్ ఉంది. అది కూడా ఎంతో దూరంలో లేదు. మన దేశంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో బెంగళూరుకు చాలా దగ్గర్లో ఉంది. అదే... నంది విలేజ్. ఆ ఊళ్లో ‘నంది హిల్స్’ చాలా ఫేమస్. టూరిస్ట్లకు, నేచర్ ఫొటోగ్రాఫర్లకు, భక్తులకు ఎంతగానో నచ్చే ప్రదేశం నంది హిల్స్.
నందిహిల్స్ బెంగళూరులోని నంది గ్రామంలో కనిపిస్తాయి. ఆ హిల్స్ బెంగుళూరుకు 62 కి.మీ. దూరంలో, చిక్బళ్లాపూర్ నుంచి10 కి.మీ ఉంటాయి. బెంగళూరు చుట్టుపక్కల పాపులర్ టూరిస్ట్ ప్లేస్ల్లో ఒకటి. అర్కావతి, పొన్నైయార్, పాలార్, పాపాగ్ని, పెన్నా నదులు పుట్టింది ఇక్కడేనని నమ్ముతారు.
కథలు కథలుగా..
చోళులకాలంలో ఈ కొండల గురించి రకరకాల కథలు వినిపించేవి. వీటిని ‘ఆనందగిరి’ అని పిలిచేవారు. అంటే.. ఆనందపు కొండ అని అర్థం. అలాగే ఇక్కడ నిద్రపోతున్న నంది ఆకారంలో కొండ ఉండడంతో వీటిని నంది హిల్స్ అని కూడా పిలుస్తారు. మరొక కథలో ఈ కొండలకు 1300 ఏండ్ల నాటి చరిత్ర ఉందని, నంది కోసం ద్రవిడుల శైలిలో ఆలయాన్ని కట్టారని చెప్పుకుంటారు. దీన్ని టిప్పు సుల్తాన్ విడిదిగా ఉపయోగించేవారట. యోగి నందీశ్వరుడు ఇక్కడ తన ప్రాణాన్ని బలి ఇచ్చాడని అందువల్లే ఈ కొండలకి ఆ పేరు వచ్చిందని ఇక్కడి ప్రజల నమ్మకం. దీన్ని నంది దుర్గం అని కూడా పిలుస్తారు.
టెంపుల్ టౌన్
నంది హిల్స్లో చూడదగ్గ వాటిలో ‘నంది టెంపుల్’ ఒకటి. దీన్నే భోగ నందీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని విజయనగర సామ్రాజ్య కాలంనాడు కెంపె గౌడ పాలనలో కట్టారు. ఈ యాత్రా స్థలం నంది హిల్స్ కింద భాగంలో ఉంటుంది. యోగనందీశ్వర, భోగ నందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రధాన దేవాలు. ఈ నిర్మాణం హోయసలలు, చోళులు, విజయనగర రాజుల పాలనలో శిల్ప సంపదగా మలిచారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఒక దీపపు స్తంభం టెంపుల్ ముందు భాగంలో ఉంటుంది. ఈ దీపపు స్తంభ దీపాలను రోజూ వెలిగిస్తారు. నంది హిల్స్ ఉన్న మరో గుడి శివ టెంపుల్. ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల మధ్య కాలం నాటిదిగా చెప్తారు. టెంపుల్ మొత్తం డిజైన్లతో అందంగా ఉంటుంది. ఇవేకాక ఇంకొన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
టిప్పు సమ్మర్ హౌస్
టిప్పు సుల్తాన్ వేసవిలో ఇక్కడే విడిది చేసేవాడు. ఆయన ఉండే గెస్ట్హౌస్ని అప్పట్లో చిక్బళ్లాపూర్ సామంత రాజులు కట్టించారు. టిప్పు సుల్తాన్ దీన్ని శత్రువు చొరబడని కోటగా తయారు చేశాడు. దీన్ని కట్టడానికి ఎక్కువ మొత్తంలో కలపను వాడారు. టవర్లు, ద్వారాలు అప్పటి ఆర్కిటెక్చర్ స్టైల్లో చెక్కారు. కోట సీలింగ్, గోడలు పెయింటింగ్లతో ఆకట్టుకుంటాయి.
మరిన్ని సంగతులు..
- నంది హిల్స్ సముద్రమట్టానికి 1,478 మీటర్ల ఎత్తులో ఉంది. బెంగళూరులో ఉన్న స్కూల్స్, కాలేజీలు హాలిడే ట్రిప్కి వెళ్లాలంటే ఇక్కడికే తీసుకొస్తారు.
- ఇక్కడ పారాగ్లైడింగ్ చాలా పాపులర్. అలాగే ఇక్కడ ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటివి చేయడాన్ని టూరిస్ట్లు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
- ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చే టూరిస్ట్లతో పాటు ప్రశాంతత కోరుకోవడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువే.
- కోటి రూపాయలతో కట్టిన ఫుడ్ కోర్ట్ ఉంది. దాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కట్టించింది. అలాగే 30 లక్షల విలువైన మ్యూజిక్ స్టేజీ కూడా ఉంది. దాన్ని సోషల్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తారు. దాంతోపాటు ప్లానెటోరియం కూడా ఉంది. పిల్లల కోసం గార్డెన్, ఆడుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
- నేచర్, పక్షుల ఫొటోలు తీసేవాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. సూర్యోదయం సమయంలో వాతావరణం చాలా అందంగా ఉంటుంది.
- జవహర్ లాల్ నెహ్రూ విడిది చేసేందుకు ఇక్కడికి వచ్చేవారు. ఆయన ఉండే ఇంటిని ‘నెహ్రూ నిలయ’ అని పిలుస్తారు. బ్రిటీష్ డిజైన్లో ఉండే 150 ఏండ్ల నాటి నిలయమది. ఆ తర్వాత మైసూర్ కమీషనర్ సర్ మార్క్ కుబ్బన్ వేసవి విడిది కోసం ఇక్కడికి వచ్చేవారు. ఇది పచ్చని తోటల్ని ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు దాన్ని గెస్ట్హౌస్గా మార్చారు.
- నంది హిల్స్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్లో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెప్టెంబర్ నుంచి మార్చిలోపు వెళ్తే ఇంకా బాగుంటుంది.
- రామకృష్ణ పరమహంస ధ్యానం చేసిన గుహ కూడా నంది హిల్స్కు దగ్గర్లోనే ఉంది. అది కూడా ఇప్పుడు పాపులర్ టూరిస్ట్ ప్లేస్. దాన్ని బ్రహ్మాశ్రమం అంటారు.
- నంది గ్రామానికి దగ్గర్లో ఉన్న నీటి వనరు అమృత సరోవర్. ఇప్పుడు దీన్ని తేనె సరస్సు అంటారు.
- చిక్బళ్లాపూర్ నుంచి ఏడు కిలో మీటర్ల దూరంలో మద్దెన హల్లి అనే ఊరుంది. అక్కడ ప్రముఖ ఇంజినీర్ దివంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఉంది. అక్కడే ఒక మ్యూజియం కూడా ఉంది. అందులో ఆయనకు సంబంధించిన రాతప్రతులు, పెయింటింగ్స్, ఫొటోలు ఉన్నాయి. దాని పక్కనే విశ్వేశ్వరయ్య సమాధి ఉంది.
టిప్పు డ్రాప్
నంది హిల్స్లో ‘టిప్పు డ్రాప్’ అనే చిన్న కొండ ఉంది. అది 600 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ప్రదేశం నంది హిల్స్ పై భాగాన ఉంది. అక్కడి నుండి టూరిస్ట్లు అందమైన పర్వత శ్రేణులు చూడొచ్చు. అయితే, ఈ కొండకు ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అదేంటంటే.. ఈ కొండ అంచును ఖైదీల్ని శిక్షించడం కోసం వాడేవారు. మరణశిక్ష పడ్డ ఖైదీలను ఈ కొండపై నుండి కిందకు తోసేవారట! టూరిస్ట్లు కూడా టిప్పు డ్రాప్ నుండి కొన్ని శబ్దాలు వినిపించాయంటారు. ఆ శబ్దాలు గతంలో అక్కడ చనిపోయిన ఖైదీల ఏడుపులని చెప్తారు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లొచ్చు. లేదంటే ట్రైన్లో, బస్ల్లో కూడా వెళ్లొచ్చు. విమానంలో... బెంగళూర్ ఎయిర్పోర్ట్లో దిగి బస్ లేదా ట్రైన్ లేదా ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.
ట్రైన్లో...
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి చిక్బళ్లాపూర్ స్టేషన్కు వెళ్లాలి. అక్కడ ట్యాక్సీ లేదా బైక్ మీద వెళ్లొచ్చు. బైక్ మీద వెళ్తే నందిహిల్స్కు రెండు కిలో మీటర్ల దూరంలోనే పార్క్ చేయాలి. అక్కడి నుంచి వేరే వెహికల్స్లో తీసుకెళ్తారు. కారులో వెళ్తే నేరుగా నంది హిల్స్కు చేరుకోవచ్చు.
బస్లో...
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలి. అక్కడి నుంచి చిక్బళ్లాపూర్కు, నంది హిల్స్కు బస్లు ఉంటాయి.