టూరిస్ట్​లకు ఎంతగానో నచ్చే నంది హిల్స్

టూరిస్ట్​లకు ఎంతగానో నచ్చే నంది హిల్స్

నేచర్​ని ఎంజాయ్​ చేయాలనుందా? దైవ దర్శనాలకు వెళ్లాలనుందా? అల్లరి చేసే పిల్లలతో గడపాలనుందా? చరిత్ర విషయాలు తెలుసుకోవాలనుందా? వీటన్నింటికి కోసం ఒక్కో టూర్​ ప్లాన్​ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కలిపి ఒకే చోట దొరికే ప్లేస్​ ఉంది. అది కూడా ఎంతో దూరంలో లేదు. మన దేశంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో బెంగళూరుకు చాలా దగ్గర్లో ఉంది. అదే... నంది విలేజ్​. ఆ ఊళ్లో ‘నంది హిల్స్’ చాలా ఫేమస్​. టూరిస్ట్​లకు, నేచర్​ ఫొటోగ్రాఫర్లకు, భక్తులకు ఎంతగానో నచ్చే ప్రదేశం నంది హిల్స్. 

నందిహిల్స్ బెంగళూరులోని నంది గ్రామంలో కనిపిస్తాయి. ఆ హిల్స్​ బెంగుళూరుకు 62 కి.మీ. దూరంలో, చిక్​బళ్లాపూర్​ నుంచి10 కి.మీ ఉంటాయి. బెంగళూరు చుట్టుపక్కల పాపులర్​ టూరిస్ట్​ ప్లేస్​ల్లో ఒకటి. అర్కావతి, పొన్నైయార్, పాలార్, పాపాగ్ని, పెన్నా నదులు పుట్టింది ఇక్కడేనని నమ్ముతారు. 

కథలు కథలుగా..

చోళులకాలంలో ఈ కొండల గురించి రకరకాల కథలు వినిపించేవి. వీటిని ‘ఆనందగిరి’ అని పిలిచేవారు. అంటే.. ఆనందపు కొండ అని అర్థం. అలాగే ఇక్కడ నిద్రపోతున్న నంది ఆకారంలో కొండ ఉండడంతో వీటిని నంది హిల్స్ అని కూడా పిలుస్తారు. మరొక కథలో ఈ కొండలకు 1300 ఏండ్ల నాటి చరిత్ర ఉందని, నంది కోసం ద్రవిడుల శైలిలో ఆలయాన్ని కట్టారని చెప్పుకుంటారు. దీన్ని టిప్పు సుల్తాన్ విడిదిగా ఉపయోగించేవారట. యోగి నందీశ్వరుడు ఇక్కడ తన ప్రాణాన్ని బలి ఇచ్చాడని అందువల్లే ఈ కొండలకి ఆ పేరు వచ్చిందని ఇక్కడి ప్రజల నమ్మకం. దీన్ని నంది దుర్గం అని కూడా పిలుస్తారు. 

టెంపుల్ టౌన్

నంది హిల్స్​లో చూడదగ్గ వాటిలో ‘నంది టెంపుల్’ ఒకటి. దీన్నే భోగ నందీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని విజయనగర సామ్రాజ్య కాలంనాడు కెంపె గౌడ పాలనలో కట్టారు. ఈ యాత్రా స్థలం నంది హిల్స్ కింద భాగంలో ఉంటుంది. యోగనందీశ్వర, భోగ నందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రధాన దేవాలు. ఈ నిర్మాణం హోయసలలు, చోళులు, విజయనగర రాజుల పాలనలో శిల్ప సంపదగా మలిచారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఒక దీపపు స్తంభం టెంపుల్​ ముందు భాగంలో ఉంటుంది. ఈ దీపపు స్తంభ దీపాలను రోజూ వెలిగిస్తారు. నంది హిల్స్​ ఉన్న మరో గుడి శివ టెంపుల్. ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల మధ్య కాలం నాటిదిగా చెప్తారు. టెంపుల్​ మొత్తం డిజైన్​లతో అందంగా ఉంటుంది. ఇవేకాక ఇంకొన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

టిప్పు సమ్మర్ హౌస్‌‌

టిప్పు సుల్తాన్‌‌ వేసవిలో ఇక్కడే విడిది చేసేవాడు. ఆయన ఉండే గెస్ట్​హౌస్​ని అప్పట్లో చిక్​బళ్లాపూర్​ సామంత రాజులు కట్టించారు. టిప్పు సుల్తాన్‌‌ దీన్ని శత్రువు చొరబడని కోటగా తయారు చేశాడు. దీన్ని కట్టడానికి ఎక్కువ మొత్తంలో కలపను వాడారు. టవర్లు, ద్వారాలు అప్పటి ఆర్కిటెక్చర్ స్టైల్​లో చెక్కారు. కోట సీలింగ్​, గోడలు పెయింటింగ్​లతో ఆకట్టుకుంటాయి. 

మరిన్ని  సంగతులు..

  • నంది హిల్స్ సముద్రమట్టానికి 1,478 మీటర్ల ఎత్తులో ఉంది. బెంగళూరులో ఉన్న స్కూల్స్, కాలేజీలు హాలిడే ట్రిప్​కి వెళ్లాలంటే ఇక్కడికే తీసుకొస్తారు. 
  • ఇక్కడ పారాగ్లైడింగ్ చాలా పాపులర్. అలాగే ఇక్కడ ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటివి చేయడాన్ని టూరిస్ట్​లు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 
  • ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చే టూరిస్ట్​లతో పాటు ప్రశాంతత కోరుకోవడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువే.  
  • కోటి రూపాయలతో కట్టిన ఫుడ్ కోర్ట్ ఉంది. దాన్ని హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ కట్టించింది. అలాగే 30 లక్షల విలువైన మ్యూజిక్ స్టేజీ కూడా ఉంది. దాన్ని సోషల్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తారు. దాంతోపాటు ప్లానెటోరియం కూడా ఉంది. పిల్లల కోసం గార్డెన్​, ఆడుకునే ఫెసిలిటీస్​ కూడా ఉన్నాయి. 
  • నేచర్​, పక్షుల ఫొటోలు తీసేవాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. సూర్యోదయం సమయంలో వాతావరణం చాలా అందంగా ఉంటుంది. 
  • జవహర్ లాల్ నెహ్రూ విడిది చేసేందుకు ఇక్కడికి వచ్చేవారు. ఆయన ఉండే ఇంటిని ‘నెహ్రూ నిలయ’ అని పిలుస్తారు. బ్రిటీష్​ డిజైన్​లో ఉండే 150 ఏండ్ల నాటి నిలయమది. ఆ తర్వాత మైసూర్ కమీషనర్​ సర్ మార్క్​ కుబ్బన్ వేసవి విడిది కోసం ఇక్కడికి వచ్చేవారు. ఇది పచ్చని తోటల్ని ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు దాన్ని గెస్ట్​హౌస్​గా మార్చారు. 
  • నంది హిల్స్​లో వాతావరణం చాలా  చల్లగా ఉంటుంది. సమ్మర్​లో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెప్టెంబర్​ నుంచి మార్చిలోపు వెళ్తే ఇంకా బాగుంటుంది. 
  • రామకృష్ణ పరమహంస ధ్యానం చేసిన గుహ కూడా నంది హిల్స్​కు దగ్గర్లోనే ఉంది. అది కూడా ఇప్పుడు పాపులర్ టూరిస్ట్ ప్లేస్. దాన్ని బ్రహ్మాశ్రమం అంటారు.
  • నంది గ్రామానికి దగ్గర్లో ఉన్న నీటి వనరు అమృత సరోవర్. ఇప్పుడు దీన్ని తేనె సరస్సు అంటారు. 
  • చిక్​బళ్లాపూర్​ నుంచి ఏడు కిలో మీటర్ల దూరంలో మద్దెన హల్లి అనే ఊరుంది. అక్కడ ప్రముఖ ఇంజినీర్​ దివంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఉంది. అక్కడే ఒక మ్యూజియం కూడా ఉంది. అందులో ఆయనకు సంబంధించిన రాతప్రతులు, పెయింటింగ్స్, ఫొటోలు ఉన్నాయి. దాని పక్కనే విశ్వేశ్వరయ్య సమాధి ఉంది. 

టిప్పు డ్రాప్‌‌

నంది హిల్స్​లో ‘టిప్పు డ్రాప్’ అనే చిన్న కొండ ఉంది. అది 600 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ప్రదేశం నంది హిల్స్ పై భాగాన ఉంది. అక్కడి నుండి టూరిస్ట్​లు అందమైన పర్వత శ్రేణులు చూడొచ్చు. అయితే, ఈ కొండకు ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అదేంటంటే.. ఈ కొండ అంచును ఖైదీల్ని శిక్షించడం కోసం వాడేవారు. మరణశిక్ష పడ్డ ఖైదీలను ఈ కొండపై నుండి కిందకు తోసేవారట! టూరిస్ట్​లు కూడా టిప్పు డ్రాప్ నుండి కొన్ని శబ్దాలు వినిపించాయంటారు. ఆ శబ్దాలు గతంలో అక్కడ చనిపోయిన ఖైదీల ఏడుపులని చెప్తారు.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లొచ్చు. లేదంటే ట్రైన్​లో, బస్​ల్లో కూడా వెళ్లొచ్చు. విమానంలో... బెంగళూర్​ ఎయిర్​పోర్ట్​లో దిగి బస్ లేదా ట్రైన్​ లేదా ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. 

ట్రైన్​లో... 

హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి చిక్​బళ్లాపూర్​ స్టేషన్​కు వెళ్లాలి. అక్కడ ట్యాక్సీ లేదా బైక్​ మీద వెళ్లొచ్చు. బైక్​ మీద వెళ్తే నందిహిల్స్​కు రెండు కిలో మీటర్ల దూరంలోనే పార్క్​ చేయాలి. అక్కడి నుంచి వేరే వెహికల్స్​లో తీసుకెళ్తారు. కారులో వెళ్తే నేరుగా నంది హిల్స్​కు చేరుకోవచ్చు. 

బస్​లో... 

హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళ్లాలి. అక్కడి నుంచి చిక్​బళ్లాపూర్​కు, నంది హిల్స్​కు బస్​లు ఉంటాయి.