ఉత్తరాంధ్ర నాకు అమ్మలాంటిది: నారాలోకేష్

ఉత్తరాంధ్ర నాకు అమ్మలాంటిది: నారాలోకేష్

ఆంధ్రప్రదేశ్ లో  వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం పేరుతో యాత్ర చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్రను లోకేష్ ప్రారంభించారు

2024  రానున్న ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) 'శంఖారావం' పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం ( ఫిబ్రవరి 11)  శ్రీకారం చుట్టారు. 

ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని ... తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవో ... ఇక్కడి ప్రజలూ అంతేనని అన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న పుట్టిన గడ్డ నుంచి 'శంఖారావం' యాత్ర ప్రారంభిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రను టీడీపీ హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడిగా 6,500 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు. అది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు.. రాబోయేది మన ప్రభుత్వమే. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.' అని లోకేశ్ స్పష్టం చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు సహా తనపై, ఇతర నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదని లోకేశ్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరి పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై న్యాయ విచారణ జరిపించి.. వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.   ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. లోకేశ్ 'యువగళం' పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ అన్నారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కోరారు.