
సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యర్శి నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీకి సీపీఐ ఓట్లు ఉపయోగపడ్డాయన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని.. దీన్ని జాతీయ నాయకత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.
రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో ఒంటెద్దు పోకడల వల్లే కాంగ్రెస్ ఓడి పోయిందన్నారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు నారాయణ.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు నారాయణ. తెలంగాణ, ఏపీలో ఒక్కో చోట పోటీ చేస్తామని చెప్పారు.
బతికి ఉండగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని విమర్శించారు నారాయణ. పట్టా పాసుబుక్ లో జగన్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాలకంటే జగన్ చేసిన తప్పులే ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రతి ఊళ్లో జగన్ సమాధికి రాయి వేసుకున్నారని మండిపడ్డారు. జగన్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు నారాయణ.