
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) మాజీ ఎండీ మనోహర్ రావుపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ హయాంలో టీజీటీడీసీ ఎండీగా ఉన్న మనోహర్ రావు సంస్థ టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారని కార్పొరేషన్అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేశ్ నాయక్ ఈ నెల 13న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు.
‘‘2018 జూన్ 20న దుర్గం చెరువు వద్ద ఎకో పార్కును లీజుకు ఇచ్చేందుకు టీజీటీడీసీ టెండర్లను ఆహ్వానించింది. కమల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధిక బిడ్డింగ్ వేసి టెండర్ ను దక్కించుకుంది. కమల్ హోటల్స్ యాజమాన్యం ఎ.ఎ.అవోకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను తమ అనుబంధ కంపెనీగా పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత అసలు బిడ్డింగ్ లో పాల్గొనని ఎ.ఎ.అవోకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద పార్కు లీజు పత్రాలను మార్చుకున్నారు. దీనికి అప్పటి ఎండీ మనోహర్ రావు సహకరించారు” అని రమేశ్ నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు