
హైదరాబాద్, వెలుగు: డ్రగ్ ఇంజక్షన్స్ అమ్ముతున్న ఓ అనస్తీషియా డాక్టర్ దందాను నార్కొటిక్స్ అధికారులు రట్టు చేశారు. అతడు పనిచేస్తున్న హాస్పిటల్పై రెయిడ్స్ చేసి రూ.6 లక్షలు విలువైన 53 వయల్స్ను స్వాధీనం చేసుకున్నారు. టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని సమీర్ హాస్పిటల్లో పనిచేస్తున్న అనస్తీషియా డాక్టర్ అర్షఫ్ ముస్తఫా ఖాన్ ఫెంటానిల్ సింథటిక్ ఓపియాయిడ్ డ్రగ్ ఇంజెక్షన్లను అక్రమంగా సేల్ చేస్తున్నాడు.
సాధారణంగా వీటిని సర్జరీ తర్వాత పేషెంట్లకు నొప్పులు తగ్గేందుకు వాడుతారు. బయట అమ్మడానికి పర్మిషన్ లేదు. కానీ వీటిని అర్షఫ్ ముస్తఫా అక్రమంగా కొంతమంది డ్రగ్స్ బాధితులకు సప్లయ్ చేస్తున్నాడు. యాప్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాడు. 4 వయల్స్కు రూ.17,500 వసూలు చేస్తున్నాడు. డాక్టర్ అర్షఫ్ ముస్తఫా డ్రగ్స్ దందాపై టీఎస్ న్యాబ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులతో కలిసి గురువారం ఉదయం జాయింట్ ఆపరేషన్ చేశారు. మెహిదీపట్నంలోని డాక్టర్ ఇంట్లో సోదాలు చేసి 53 వయల్స్ స్వాధీనం చేసుకున్నారు. అర్షఫ్ ముస్తఫా కువైట్లో ఉండడంతో ఆయన భార్య నజీబ్ ఖాన్ను అరెస్టు చేశారు.