నరేంద్రుడికే మళ్లీ పట్టం కట్టిన ఓటరన్న

నరేంద్రుడికే మళ్లీ పట్టం కట్టిన ఓటరన్న

మోడీకే మరోసారి దేశ ప్రజలు పట్టంగట్టారు. ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. లోక్​సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్​ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యాన్ని కనబర్చాయి. యాభై.. వంద.. నూటయాభై…రెండువందలు.. ఇలా నిమిషం నిమిషానికి లీడ్స్​ పెరుగుతూ పోయాయి. కేంద్రంలో అధికారానికి కావాల్సిన 272 సీట్ల మ్యాజిక్​ ఫిగర్​ను కౌంటింగ్​ ప్రారంభమైన మూడుగంటల్లోనే ఎన్డీయే దాటేసింది. 352 సీట్లకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలలోపే ట్రెండ్స్​ తెలిసినా.. క్యాండిడేట్లలో మాత్రం ఉత్కంఠ కనిపించింది.  మధ్యాహ్నం 2 తర్వాత ఒకటొకటిగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్​ నాయకత్వంలోని యూపీఏ 95 సీట్లు సాధించగా..  అటు ఎన్డీయేకు కానీ, ఇటు యూపీఏకు కానీ మద్దతు తెలుపని తటస్థ పార్టీలు 95 దగ్గర  ఆగిపోయాయి. మొత్తం 543 లోక్​సభ స్థానాల్లో తమిళనాడులోని వెల్లూరు సీటుకు ఎన్నికలు వాయిదా పడగా.. 542 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్​ 11 నుంచి ఏడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికలు ఈ నెల 19తో ముగిశాయి.

అదేరోజు సాయంత్రం ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాల్లో ఎవరిది అధికారమో ఒక అంచనా ఏర్పడింది. ఎన్డీయేనే మళ్లీ పవర్​లోకి వస్తుందని తేలింది. కానీ, ఎగ్జిట్​ పోల్స్​ తారుమారయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదించాయి. ఆ వాదన నిలబడలేదు. ఒకటీ రెండు సర్వే సంస్థల అంచనాలు తప్ప అన్ని ఎగ్జిట్​ పోల్స్​ నిజమయ్యాయి. హిందీ రాష్ట్రాలతోపాటు గుజరాత్​, మహారాష్ట్రలో బీజేపీ దాదాపు క్లీన్​స్వీప్​ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు నార్త్​ ఈస్ట్​ రాష్ట్రాల్లో బలమైన శక్తిగా అవతరించింది. సౌత్​ రాష్ట్రాల్లోని కర్నాటకలో అత్యధిక సీట్లు సాధించింది. తెలంగాణలోనూ 4 సీట్లు గెలిచి.. సత్తా చాటింది.  కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ మినహా దేశమంతటా బీజేపీ, దాని మిత్రపక్షాల హవా నడిచింది. అన్ని రాష్ట్రాల్లో సగటున బీజేపీ 50శాతం ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ల లోక్​సభ ఎన్నికల్లో ఓట్ల శాతం విషయంలో అత్యధిక ఓట్లు దక్కించుకున్న తొలి పార్టీగా కూడా ఈసారి బీజేపీ రికార్డుకెక్కింది. ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్​లోని వారణాసి నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. 4లక్షల 79వేలకుపైగా మెజారిటీ సాధించారు.

బీజేపీ చీఫ్​ అమిత్​ షా గుజరాత్​లోని గాంధీనగర్​ నుంచి 5లక్షలకుపైగా మెజారిటీ రాబట్టుకున్నారు. ఇక, కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీకి పరాభవం ఎదురైంది. కేంద్రంలో అధికారం మాట అటుంచితే తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్​లోని అమేథిలో ఆయన బీజేపీ క్యాండిడేట్​ స్మృతి ఇరానీ చేతుల్లో ఓడిపోయారు. అయితే.. కేరళలోని వయనాడ్​లో మాత్రం రాహుల్​ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ వంటి ఉద్ధండులకు కూడా ఓటమి తప్పలేదు.

బీజేపీ ‘హార్ట్’​ల్యాండ్​

హిందీ హార్ట్​ల్యాండ్​ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌, హర్యానా,  హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, జార్ఖండ్​, బీహార్, ఉత్తరాఖండ్‌‌, ఢిల్లీ.. బీజేపీకి భారీ స్థాయిలో సీట్లు కట్టబెట్టాయి. ఉత్తర ప్రదేశ్‌‌లో  కూడా ఆ పార్టీ మంచి ఫలితాలే రాబట్టకున్నప్పటికీ 2014తో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గాయి. యూపీలో ఈ సారి ఎస్పీ, బీఎస్పీ,  ఆర్​ఎల్డీ కూటమిగా బరిలోకి దిగడం బీజేపీ సీట్లపై ప్రభావం చూపింది. అయినా.. అక్కడున్న 80 సీట్లలో అప్నాదళ్​తో కలిసి బీజేపీ 62 సీట్లను గెలుచుకుంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమికి కేవలం 15 సీట్లే వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 71 సీట్లు గెలిచింది. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్​లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్​ పవర్​లోకి వచ్చింది. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం కనిపించలేదు. రాష్ట్రంలో వేరు.. కేంద్రంలో వేరు అన్న ఆలోచనలతో ఓటర్లు గంపగుత్తగా కమలానికి ఓటేశారు. బీహార్​లోని మొత్తం 40 సీట్లలో 39,  మధ్యప్రదేశ్​లోని మొత్తం 29 సీట్లలో 28, రాజస్థాన్​లోని మొత్తం 25 సీట్లలో 25, హర్యానాలోని మొత్తం 10 సీట్లలో 9, జార్ఖండ్​లోని మొత్తం 12 సీట్లలో 10, చత్తీస్​గఢ్​లో మొత్తం 11 సీట్లలో 9, ఢిల్లీలో మొత్తం 7 సీట్లలో 7 సీట్లలో కమలనాథులు దూసుకుపోయారు.

దీదీ కోటలో దిల్​దార్​గా..

ఈ లోక్​సభ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క పశ్చిమ బెంగాలే. అక్కడ మొత్తం 42 లోక్​సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. ఈసారి అనూహ్యంగా పుంజుకొని.. 18 సీట్లకు ఎగబాకింది. గత ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన రాష్ట్రంలోని అధికార టీఎంసీ.. ఈ సారి 22కు పరిమితమైంది. ఒకప్పుడు లెఫ్ట్ ఫార్టీల కంచు కోటగా ఉన్న బెంగాల్​.. అటు తర్వాత టీఎంసీ వశమైంది. ప్రతి ఎలక్షన్​లో టీఎంసీ, లెఫ్ట్​ పార్టీలు పోటాపోటీగా ఉండేవి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ, బీజేపీ మధ్యే పోరు సాగింది. ప్రధాని నరేంద్రమోడీ, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ మధ్య ఈ ఎన్నికల్లో మాటల యుద్ధం సాగింది. ఒకానొక దశలో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా కూడా దీదీ మారిపోయారు. కానీ.. మోడీ సునామీకి టీఎంసీ కోటలు కూలిపోయాయి. రెండేళ్లుగా రాష్ట్రంపై కమలనాథులు స్పెషల్​ ఫోకస్​ పెట్టి.. అత్యధిక స్థానాలను రాబట్టుకోగలిగారు. ఇక, ఒడిశాలో 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. అధికార బీజేడీ 20 సీట్లు సాధించింది. అయితే.. ఈ సారి అక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. రాష్ట్రంలో మళ్లీ బీజేడీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన సీట్లు సాధించుకుంది. అయితే.. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, బీజేడీ నువ్వా నేనా అన్నట్లు గా తలపడ్డాయి. బీజేపీ 8, బీజేడీ 12 సీట్లు సాధించాయి.  గుజరాత్​లో 26 సీట్లకు 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనతో కలిసి 41 సీట్లు సాధించుకుంది. జమ్ముకశ్మీర్​లోనూ పట్టు నిలుపుకుంది.

సౌత్​లో కలిసొచ్చిన కర్నాటక, తెలంగాణ

సౌత్​లో బీజేపీకి పట్టున్న రాష్ట్రం కర్నాటక. ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. కాంగ్రెస్​, జేడీఎస్​ కలిసి అధికారంలోకి వచ్చాయి. లోక్​సభ ఫలితాలు వెలువడిన నాటికి కరెక్ట్​గా అక్కడ కాంగ్రెస్​, జేడీఎస్​ ప్రభుత్వం ఏర్పడి ఏడాది. ఏడాదిలోనే సీన్​ మొత్తం మారిపోయింది. మొత్తం 28 లోక్​సభ సీట్లలో ఈ సారి 25 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్​, జేడీఎస్​ కూటమి 2 సీట్లకే పరిమితమైంది. జేడీఎస్​ వ్యవస్థాకుడు, మాజీ పీఎం దేవెగౌడ, ఆయన మనుమడు నిఖిల్​ కూడా ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. గత లోక్​సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ 19 సీట్లు గెలుచుకుంది. కర్నాటకతో పాటు ఈసారి ఎవరూ ఊహించనట్లుగా తెలంగాణలో 4 చోట్ల విజయం సాధించింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సికింద్రాబాద్​కే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ సీట్లను గెలుచుకుంది. ఏపీ​, కేరళలో ఒక్క సీటునూదక్కించుకోలేదు. తమిళనాడులో తన మిత్ర పక్షం అన్నాడీఎంకేతో కలిసి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే.. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సారి తమిళనాడులోని ప్రధాన ప్రత్యర్థులు అన్నాడీఎంకే, డీఎంకే.. జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకున్నాయి. అన్నాడీఎంకే బీజేపీతో డీఎంకే కాంగ్రెస్​తో కలిసి బరిలోకి దిగాయి. తమిళనాడులో బీజేపీ అంత సత్తా చాటకపోయినప్పటికీ అక్కడ కూడా తాము ఉనికిలో ఉన్నామని నిరూపించుకోగలిగామని, ఇదే మున్ముందు మంచి ఫలితాలను ఇస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

పదేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్​ నాయకత్వంలోని యూపీఏను 2014లో గద్దె దించి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ.. ఐదేళ్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో కొన్ని ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పటికీ.. వాటి ఫలితాలు మున్ముందు వస్తాయని బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే, ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మంత్రంతోనే ఎన్నికలకు వెళ్లారు. నేషనలిజాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. పాక్​లోని టెర్రర్​ స్థావరాలపై జరిపిన సర్జికల్​ స్ట్రయిక్స్​ను గుర్తుచేశారు. ‘అబ్​ కీ బార్​ 300 ప్లస్​’ నినాదంతో బీజేపీ చీఫ్​ అమిత్​ షా.. కార్యకర్తలను ముందుండి నడిపించారు. అయితే.. కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​ మాత్రం ‘చౌకీదార్​ చోర్​ హై’ అంటూ జనంలోకి వచ్చారు. న్యాయ్​ వంటి పథకాలు మేనిఫెస్టోలో చేర్చినా..‘చౌకీదార్​ చోర్​ హై’ అన్న నినాదాన్నే ఆయన బలంగా వినిపించాలనుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా రాహుల్​తో పాటు టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్​ మాయావతి, ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​, టీడీపీ చీఫ్​ చంద్రబాబు, ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​, డీఎంకే చీఫ్​ స్టాలిన్​, జేడీఎస్​ చీఫ్​ కుమార స్వామి ఇలా అన్ని ప్రతిపక్షాలు ఒకటిగా నడిచాయి. కానీ.. ఓటర్లు మాత్రం మోడీ వైపు నడిచారు. మోడీ నేషనలిజానికి, ఆయన ఐదేళ్ల పాలనకు ఓటేశారు. ఐదేళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, రైతు సమస్యలను ఆలకించలేదని, క్రైం రేట్​ పెరిగిందని, రాఫెల్​ పేరిట లక్షల కోట్లు అంబానీకి కట్టబెట్టారని ఇలా  ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఓటర్లు ఆలకించలేదు. చౌకీదార్​ మోడీతోనే దేశానికి రక్షణ అంటూ ఏకపక్షంగా తీర్పు నిచ్చారు.